రూటు మార్చనున్న మారుతి సుజుకి : SUV, ఎంపీవీ సెగ్మెంట్పై ఫోకస్
భారత దేశంలో అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి తన రూట్ ను మార్చుకోబోతోంది. ఆల్టో వంటి చిన్న కార్లకు పెట్టింది పేరు ఐన దేశీ కార్ల దిగ్గజం... ఇక నుంచి తన కార్ల లో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్ యూ వీ ), మల్టీ పర్పస్ వెహికల్ (ఎం పీ వీ) అధికంగా ఉండేలా వ్యూహాల్ని సిద్ధం చేస్తోంది. దశాబ్దాలుగా దేశంలో నెంబర్ వన్ కార్ల తయారీ కంపెనీగా ఉన్న మారుతి ... ఇప్పుడు ఆర్థిక మందగమన పరిస్థితులను, మారుతున్న వినియోగదారుల అభిరుచులను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.
దీంతో సమీప భవిష్యత్ లో మంచి ఆదరణ లభించే కార్లనే అధికంగా మార్కెట్లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఇటీవలి మందగమనం లోనూ భారత మార్కెట్లోకి కొత్తగా ప్రవేశించిన కియా మోటార్స్, ఎంజీ మోటార్స్ కార్ల అమ్మకాలు మెరుగ్గా ఉండటం కూడా ఇందుకు ఒక కారణంగా కనిపిస్తోంది. మారుతి సుజుకి సరికొత్త వ్యూహాలపై ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. కియా మోటార్స్ కు చెందిన సెల్టోస్ కార్ మార్కెట్లో మంచి ఆదరణ పొందిన విషయం తెలిసిందే. ఇక ముందు రూ 20 లక్షల వరకు విలువ ఉండే ఎస్ యూ వీ లు, ఎం పీ వీ కార్ల తయారీకి మారుతి సుజుకీ జై కొట్టనుంది.
మెచ్యూరిటీకి ముందే పీఎఫ్ ఉపసంహరించుకుంటే ట్యాక్స్ పడుతుంది
టొయోటా తో జట్టు...
సరికొత్త వ్యూహం లో భాగంగా మారుతి సుజుకి మరో జాపనీస్ కార్ల తయారీ దిగ్గజం టొయోట తో జట్టు కట్టనుంది. హ్యుండై మోటార్స్ కు చెందిన క్రెటా సెగ్మెంట్ కారును 2022 లో మారుతి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ కారు ప్రస్తుత విటారా బ్రేజా ఆర్కిటెక్చర్ కు దగ్గరగా ఉండనుంది. అదే సమయంలో మరో ఏసి సెగ్మెంట్ ఎం పీ వీ కారును 2023 లో విడుదల చేయాలనీ భావిస్తోంది. ఈ రెండు కార్లు మారుతి సుజుకి... టొయోట కు చెందిన బిదాడి ప్లాంటులో ఉత్పత్తి చేయబోతున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. కొత్తగా రూపొందించిన బాలెనొ, సియాజ్, ఎర్టిగా కార్లలా కాకుండా .. ఈ రెండు సరికొత్త కార్లతో అటు మారుతి సుజుకి ఇటు టొయోట కు మేలు జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
యుటిలిటీ వెహికల్స్ దే హవా..
భారత దేశంలో కార్ల వినియోగదారుల అభిరుచులువేగంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు చిన్న కార్లని ఇష్టపడ్డ వారు ఇప్పుడు పెద్ద కార్లకు అప్గ్రేడ్ అయ్యేందుకు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా క్లాస్ గా కనిపించే సెడాన్ కార్ల కంటే ... రగ్డ్ లుక్ తో ఉండే యుటిలిటీ వెహికల్స్ కు జై కొడుతున్నారు. ఇందుకోసం ప్రీమియం చెల్లించేందుకు వెనుకాడటం లేదు. ఈ కార్లు కూడా రూ 5 లక్షల నుంచి రూ 1 కోటి మధ్య ధరల శ్రేణిలో లభిస్తున్నాయి. అందుకే కంపెనీలు కూడా వాటి వ్యూహాలను మార్చుకోక తప్పట్లేదు. మారుతి కి కలిసొచ్చిన చిన్న కార్ల సెగ్మెంట్ వాటా 7 ఏళ్ళ క్రితం 25% ఉండగా ... ప్రస్తుతం అది కాస్త 10% నికి పరిమితం అవుతోంది. అదే సమయంలో యుటిలిటీ వాహనాల వాటా 2019 లో 38% నికి చేరుకోనుంది. 2020 నాటికి ఈ సెగ్మెంట్ అతిపెద్ద సెగ్మెంట్ గా అవతరించనుంది.
ఎస్-ప్రెస్సో అందులో భాగమే...
మారుతున్న మారుతి సుజుకి వ్యూహాల్లో మొదటిది ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ఎస్-ప్రెస్సో మోడల్. ఇది ఎంట్రీ లెవెల్ ఎస్ యూ వీ కావటం విశేషం. అదే సమయంలో కంపెనీ విటారా బ్రేజా, ఎస్- క్రాస్ లలో పెట్రోలు వెర్షన్ ని ప్రవేశపెట్టనుంది. కాలుష్య ప్రమాణాలు మారుతున్నాయి కాబట్టి పెట్రోల్ వెర్షన్ తప్పనిసరి కానుంది. మారుతి ప్రవేశ పెట్టనున్న సరికొత్త ఎస్ యూ వీ, ఎం పీ వీ వాహనాలకు ప్రస్తుతం తమ స్విఫ్ట్, డిజైర్, సియాజ్, ఎర్టిగా కార్లను వాడుతున్న వినియోగదారులు అప్ గ్రేడ్ అవుతారని భావిస్తోంది. విటారా బ్రేజా, ఎస్-క్రాస్ కార్లతో ఇప్పటివరకు యుటిలిటీ వాహనాల విభాగంలో మార్కెట్ లీడర్ గ ఉన్న మహీంద్రా ను మారుతి సుజుకి అధిగమించింది. కానీ హ్యుండై వెన్యూ, మహీంద్రా ఎక్స్ యూ వీ 300 లతో పోటీ ఎదుర్కొంటోంది.
నెక్సా తో 10 లక్షలు...
ప్రీమియం సెగ్మెంట్ కార్లను విక్రయించేందుకు ఏర్పాటు చేసిన సరికొత్త రిటైలింగ్ డివిజన్ నెక్సా... కూడా మారుతి సుజుకి వ్యూహాలకు తగ్గట్టుగా పనితీరును కనబరుస్తోంది. ఈ విభాగం ద్వారా ఇప్పటికే 10 లక్షల కార్లను విక్రయించగలిగింది. ఈ విషయంలో హోండా సిటీ కార్లను కూడా కంపెనీ అధిగమించగలిగింది. మరో వైపు మారుతి సుజుకి ప్రత్యర్థులు రూపొందిస్తున్న సుమారు 12 మోడల్స్ కు సమాధానంగా కొత్తవి ప్రవేశపెట్టబోతోంది. ఇప్పటి వరకు దేశంలో ప్రతి రెండు కార్లలో ఒకటి మారుతి సుజుకిదే ఉంటోంది. దీనిని కాపాడుకోవటం కోసం మరింత పదును పెట్టిన వ్యూహాలని అమలు చేయబోతోంది.