వంట నూనె ధరలకు రెక్కలు ... కరోనా కష్టాల్లోనూ సామాన్యులకు తప్పని తిప్పలు
ఒకపక్క కరోనా కష్టకాలం, మరోపక్క విపరీతంగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యుల జీవితం అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా విపరీతంగా పెరుగుతున్న వంటనూనెల ధరలు సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు మరింత భారంగా మారుతోంది.గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు వంటనూనెల ధరలు చూస్తే 20 నుండి 56 శాతం వరకు పెరిగాయి.
మంటెక్కిస్తున్న వంటనూనెలు.. కొనలేని స్థితిలో సామాన్యులు
వేరుశెనగ నూనె రెండు వందల రూపాయలకు చేరుకుంది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు .ఇక సన్ ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, ఆవనూనె, డాల్డా, పామాయిల్ తో సహా అన్ని నూనెల ధరలు ఊహించని విధంగా పెరిగాయి. మంటెక్కిస్తున్న వంటనూనెలు సామాన్య, మధ్య తరగతి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. అసలే కరోనా కష్టకాలంలో ఉన్న వారికి సంపాదన అంతంత మాత్రంగా ఉంటే మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు విపరీతంగా పెరిగిన వంటనూనెల ధరలు ఇబ్బంది పెడుతున్నాయి.
వంటనూనెల డిమాండ్ లో 56 శాతం దిగుమతి చేసుకుంటున్న నూనె
ఒక కేజీ నూనె ధర రెండు వందల రూపాయల వరకు ఉంటే సామాన్యులు ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అని లబోదిబోమంటున్నారు .
నిత్యావసర వస్తువైన వంటనూనెల ధరలు విపరీతంగా పెరుగుతున్నా ప్రభుత్వాలు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. అందుకు కారణం భారతదేశంలోని వంటనూనెల డిమాండ్ లో 56 శాతం దిగుమతి చేసుకుంటున్న నూనె. ఈ కారణంగా అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలు మన దేశంలోని వంటనూనెల పై ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
సామాన్యులకు వంట నూనెలు అందుబాటులో ఉంచేలా సర్కార్ తీసుకోవలసిన నిర్ణయాలు ఇవే
సామాన్యుల జీవితంపై వంట నూనెలు పెడుతున్న మంట తగ్గాలంటే ప్రభుత్వం ముందు దిగుమతి సుంకాన్ని తగ్గించడం ఒక మార్గంగా ఉంది. అంతేకాదు విపరీతంగా పెరిగిన వంటనూనె ధరలకు పగ్గాలు వేసి, సబ్సిడీ మీద ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందుబాటులో ఉంచటం వల్ల కూడా కొంత మేర ప్రయోజనం ఉంటుంది. ఏది ఏమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజా పరిణామాల నేపథ్యంలో అటు వంటనూనెలు, నిత్యావసర వస్తువుల ధరలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడం పై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.