HCL ఛైర్మెన్ బాధ్యతలకు శివ్ నాడర్ గుడ్బై..కొత్త ఛైర్పర్సన్ ఎవరో తెలుసా..?
న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీస్ 31.7శాతం లాభాలు వచ్చినట్లు పేర్కొంది. జూన్ 2020 త్రైమాసికానికి రూ. 2,925 కోట్లు నికర లాభంను ప్రకటిస్తూనే మరో సంచలనమైన ప్రకటన చేసింది. ఇప్పటి వరకు హెచ్సీఎల్ టెక్నాలజీస్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చి ముందుండి నడిపించిన ఛైర్మెన్ శివ్ నాడార్ ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇక శివ్ నాడార్ స్థానంలో ఆయన కుమార్తె రోషిణీ నాడార్ మల్హోత్రా ఆ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ మార్పు వెంటనే అమల్లోకి వస్తుందని సంస్థ వెల్లడించింది.
2019 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి హెచ్సీఎల్ టెక్నాలజీస్ రూ.2,220 కోట్లు లాభాన్ని ప్రకటించింది. గతేడాది త్రైమాసికంతో పోలిస్తే ఈసారి 8.6శాతం మేరా రెవిన్యూ పెరిగి రూ.17,841 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికానికి రూ.16,425 కోట్లు రెవిన్యూ చేకూరింది. ఇక తమ లాభాలకు సంబంధించిన ఫైలింగ్లో కంపెనీ ఛైర్మెన్గా శివ్ నాడార్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారని పేర్కొంది. అంతేకాదు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రోషిణి నాడార్ను కొత్త ఛైర్పర్సన్గా నియమించేందుకు ఆమోదం తెలిపారని ఫైలింగ్లో హెచ్సీఎల్ పేర్కొంది. అంతేకాదు శివనాడార్ తన అభీష్టం మేరకే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారని వివరించిన ఫైలింగ్... తను కంపెనీ ఎండీగా కొనసాగుతారని చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్గా ఉంటారని స్పష్టం చేసింది.
ఇక హెచ్సీఎల్ టెక్నాలజీస్ రెవిన్యూ ప్రతి త్రైమాసికానికి పెరుగుదల నమోదు చేస్తోందని సంస్థ వెల్లడించింది. సగటున 1.5 నుంచి 2.5శాతం మేరా స్థిరమైన వృద్ధిని కనబరుస్తోందని కంపెనీ తన ఫైలింగ్లో పేర్కొంది. రానున్న మూడు త్రైమాసికాల్లో కూడా ఇదే స్థిరత్వాన్ని నమోదు చేస్తుందని అంచనా వేసింది. ఇదిలా ఉంటే హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఒక షేరును రూ.2 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. జూన్ 2020 త్రైమాసికం చివరి నాటికి హెచ్సీఎల్లో 1,50, 287 మంది ఉద్యోగస్తులు ఉండగా మరో 7,005 మంది ఉద్యోగస్తులు చేరారు.