టీసీఎస్ షేర్ హోల్డర్లకు బిగ్ షాక్: రికార్డు స్థాయిలో పతనం
ముంబై: సాఫ్ట్వేర్ టెక్నాలజీకి చెందిన దేశీయ దిగ్గజ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) షేర్లు ఇన్వెస్టర్లకు బిగ్ షాక్ ఇచ్చాయి. టీసీఎస్ షేర్ల వ్యాల్యూ ఒక్కసారిగా దిగజారింది. ఈ షేర్లల్లో ఏడు శాతం వరకు క్షీణత కనిపించింది. కనిష్ఠ స్థాయికి పడిపోయాయి టీసీఎస్ షేర్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను వెల్లడించిన అతి కొద్ది రోజుల్లోనే టీసీఎస్ షేర్లు రికార్డుస్థాయిలో పతనం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రెండో త్రైమాసికం ఫలితాలు వెల్లడించిన వెంటనే..
దీనికి గల కారణాలను మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తోన్నాయి.. ఆరా తీస్తోన్నాయి. కిందటి శుక్రవారమే టీసీఎస్ తన రెండో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. 9,624 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్ను నమోదు చేసుకుందా కంపెనీ. ఇయర్-ఆన్-ఇయర్లో 14.1 శాతం మేర పురోగతిని నమోదు చేసింది. రెవెన్యూ 16.8 శాతం మేర అంటే 46,867 కోట్ల రూపాయలకు పెరిగింది. శని, ఆదివారాల్లో మార్కెట్కు సెలవు.
బీఎస్ఈలో, ఎన్ఎస్ఈలో..
సోమవారం బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో లావాదేవీలు మొదలైన కొద్దిసేపటికే 3.5 శాతం క్షీణతతో ట్రేడింగ్ ఆరంభమైంది. 3,797 రూపాయల వేల్యూతో ట్రేడింగ్ మొదలైంది. శుక్రవారం నాటి క్లోజింగ్ ట్రేడింగ్.. రూ.3,935.30 పైసలు. అదే ఓపెనింగ్తో ట్రేడ్ కాలేకపోయాయి టీసీఎస్ షేర్లు. కనిష్ఠ స్థాయికి 3,660 రూపాయలకు క్షీణించాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ 13,00,000 కోట్ల రూపాయలుగా రికార్డయింది. ఈ ఉదయం నమోదైన ట్రేడింగ్ మాత్రం ఏడుశాతం మేర క్షీణతకు దారి తీసింది.
అంచనాలను అందుకోకపోవడం వల్లే
బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో 6.99 శాతం, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఏడు శాతం మేర క్షీణతను రికార్డు చేసుకుంది. ఒక్కో షేరు విలువ 3,660 రూపాయల వద్ద నిలిచింది. సెన్సెక్స్ అండ్ నిఫ్టీలో టీసీఎస్ టాప్ లాసర్గా గుర్తింపు తెచ్చుకుంది. రెండో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడం వల్లే దీనికి కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తోన్నాయి. టీసీఎస్పై పెట్టుబడిదారులు పెట్టుకున్న అంచనాలు తలకిందులయ్యాయని ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అభిప్రాయపడింది.
మళ్లీ పుంజుకోగలుగుతుందంటూ..
2022-2024 ఆర్థిక సంవత్సరాల్లో టీసీఎస్పై పెట్టుకున్న అంచనాలను కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ తగ్గించింది కూడా. ఈ దెబ్బతో 3-4 నుంచి శాతానికి తన అంచనాలకు కుదించింది. 4,100 రూపాయలకు చేరుకోవచ్చని తాజాగా పేర్కొంది. గోల్డ్మెన్ సాచ్స్ తన అంచనాలను టీసీఎస్ షేర్ ఒక్కింటికి రూ.4,657గా నిర్ధారించగా.. ఐసీఐసీఐ డైరెక్ట్, యూబీఎస్ ఇవే తరహాలో అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగబోదని, టీసీఎస్ షేర్లు మళ్లీ పుంజుకుంటాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.