పేటీఎం షేర్ హోల్డర్లకు జేపీ మోర్గాన్ గుడ్న్యూస్: పతనం నుంచి పైకి
ముంబై: పేటీఎం.. గత సంవత్సరం నవంబర్లో ఇన్వెస్టర్ల ముందుకొచ్చిన బిగ్గెస్ట్ పబ్లిక్ ఇష్యూ. 18,500 కోట్ల రూపాయలను సమీకరించుకోవడానికి ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ను జారీ చేసిందీ కంపెనీ. ఇన్వెస్టర్లకు అంచనాలకు మించిన ఆదరణను సొంతం చేసుకుంది. కొన్నేళ్లుగా మార్కెట్లో విస్తృతంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న డిజిటల్ పేమెంట్ సంస్థ కావడం వల్ల పేటీఎం షేర్లను కొనుగోలు చేయడానికి రిటైల్ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ఆసక్తి చూపారు. లాభాలు వస్తాయని ఆశించారు.
బ్లాక్ బస్టర్ ఐపీఓ..అట్టర్ ఫ్లాప్
బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ రోజు ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశకు గురిచేసింది పేటీఎం పబ్లిక్ ఇష్యూ. నష్టాలతో లిస్టింగ్ అయింది. ఇన్వెస్టర్లకు ఒక్కో షేర్ మీద వందల రూపాయల్లో నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. బ్లాక్ బస్టర్ ఐపీఓగా భావిస్తుందనుకున్నప్పటికీ అట్టర్ ఫ్లాప్ అయింది.
72 శాతం నష్టాల్లో..
ఇంత భారీ రేట్ పెట్టినప్పటికీ.. ఆ కంపెనీ మీద ఉన్న నమ్మకంతో రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు. లిస్టింగ్ రోజున సినిమా చూపించింది. ఏకంగా 1,564.15 రూపాయలతో స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ అయింది. 2,150 రూపాయలను పెట్టి కొనుగోలు చేసిన ఒక్క షేర్.. లిస్టింగ్ రోజే 500 రూపాయల నష్టాన్ని ఇచ్చింది. ఆ తరువాత ఏ దశలో కూడా పేటీఎం షేర్లు పుంజుకోలేదు. ఓ సందర్భంగా 1,700 రూపాయల మార్క్ను దాటగలిగింది. ఆ తరువాత అంతా తిరోగమనమే.
రూ.600 మార్క్ దాటి..
ప్రస్తుతం ఈ షేర్ ధర స్టాక్ మార్కెట్లో కొద్దిరోజులుగా 500 నుంచి 550 రూపాయల మధ్య ఊగిసలాడుతూ వచ్చింది. కిందటి నెల నుంచి క్రమంగా ఈ కంపెనీ షేర్ ధర పెరుగుతోంది. ప్రస్తుతం రూ.613.65 పైసల వద్ద ట్రేడ్ అయింది. మంగళవారం నాటితో పోల్చి చూస్తే రూ.4.15 పైసల మేర నష్టపోయినప్పటికీ.. భవిష్యత్తులో మరింత పెరుగుతుందని అమెరికా ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ జేపీ మోర్గాన్ అంచనా వేసింది.
రూ.635 వరకు వెళ్లి..
ఒక దశలో పేటీఎం షేర్ ధర రూ.635.80 పైసల వరకు వెళ్లింది. ఇంకా పెరుగుతుందనుకున్న దశలో తిరోగమించింది. మధ్యాహ్నం 3:30 గంటలకు స్టాక్ మార్కెట్ లావాదేవీలు ముగిసే సమయానికి రూ. 613.65 పైసలకు క్షీణించింది. ఇదివరకటి పతనంతో కంపేర్ చేసి, చూసినా ఇది తక్కువే. గరిష్ఠంగా 1,700 రూపాయల వద్ద ట్రేడ్ అయిన పేటీఎం షేర్ ధర ఒక్కసారిగా 500 వరకు పడిపోయింది. ఇప్పుడిప్పుడే పెరుగుదల కనిపిస్తోంది. మరో ఏడాదిలో 62 శాతం మేర పెరుగుతుందని జేపీ మోర్గాన్ అంచనా వేసింది.