నిండా మునిగిన ఫేస్బుక్: 230 బిలియన్ డాలర్లు నష్టం: జుకర్ ఆస్తులు ఆవిరి
వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్ఫామ్ ఫేస్బుక్.. నిండా మునిగింది. ఫేస్బుక్ మాతృసంస్థ మెటా షేర్లు దారుణంగా పడిపోయాయి. ఒక్కరోజులో 26.4 శాతం మేర క్షీణించాయి. ఇదో చారిత్రాత్మక పతనంగా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. ప్రపంచాన్ని శాసిస్తోన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ షేర్ల ధర ఒక్కరోజులో ఈ స్థాయిలో పడిపోవడం పట్ల ఆందోళనకు గురి అవుతున్నాయి. మూడో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
230 బిలియన్ డాలర్ల పతనం..
అమెరికా కాలమానం ప్రకారం.. అక్కడి స్టాక్ మార్కెట్ నాస్డాక్లో గురువారం సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఫేస్బుక్ షేర్లల్లో 26.4 శాతం మేర క్షీణత కనిపించింది. దీని విలువ 230 బిలియన్ డాలర్ల మేర పతనం అయ్యాయి. దీన్ని భారతీయ కరెన్సీలోకి మార్చుకుంటే 17,209,186,270 రూపాయలు అవుతుంది. దీనితోపాటు డెయిలీ యాక్టివ్ యూజర్ల సంఖ్య కూడా భారీగా క్షీణించినట్లు మెటా కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. 18 సంవత్సరాల తరువాత తొలిసారిగా డెయిలీ యాక్టివ్ యూజర్ల సంఖ్య తగ్గిందని పేర్కొంది.
31 బిలియన్ డాలర్లు
ఈ పతనం ప్రభావం వల్ల మెటా వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి మార్క్ జుకర్బర్గ్ వ్యక్తిగత ఆస్తులు హరించుకుపోయాయి. 31 బిలియన్ డాలర్ల మేర ఆయన ఆస్తులు ఆవిరి అయ్యాయి. ఆయన కోల్పోయిన ఆస్తుల విలువ ఓ యూరప్ దేశ స్థూల జాతీయోత్పత్తితో సమానం. ఈస్టోనియా జీడీపీతో సమానమైన ఆస్తులను మార్క్ జుకర్బర్గ్ ఒక్కరోజులో కోల్పోవాల్సి వచ్చింది. అందులో పెట్టుబడి పెట్టిన వారు, మెటా షేర్ల కొనుగోలుదారులు, రిటైల్ ఇన్వెస్టర్లు ఘోరంగా నష్టపోయారు.
అంబానీ, అదానీల ఆస్తులే అధికం..
ఈ మహాపతనం తరువాత మార్క్ జుకర్బర్గ్ ఆస్తులు 85 బిలియన్ డాలర్లకు చేరింది. ఫలితంగా- భారత పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ- జుకర్బర్గ్ కంటే ఆస్తిపరులు అయ్యారు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ ఆస్తుల విలువ 90.1, 90 బిలియన్ డాలర్లు. అంటే- జుకర్బర్గ్ ఆస్తుల కంటే అయిదు బిలియన్ డాలర్ల ఎక్కువే. ప్రపంచ కుబేరుల జాబితాలో జుకర్బర్గ్ 12వ శాతానికి పడిపోయాడు కూడా.
డెయిలీ యాక్టివ్ యూజర్ల సంఖ్యలోనూ..
ఫేస్బుక్ డెయిలీ యాక్టివ్ యూజర్లు 1.930 బిలియన్ల నుంచి 1.929 బిలియన్లకు క్షీణించింది. డిసెంబర్ నాటికి ముగిసిన మూడో త్రైమాసికంలో అనూహ్యంగా ఈ సంఖ్య పడిపోయిందని మెటా యాజమాన్యం తెలిపింది. కంపెనీ స్థాపించిన తరువాత తొలిసారిగా రోజువారీ వినియోగదారుల సంఖ్య తగ్గిందని పేర్కొంది. మూడో త్రైమాసికం ఫలితాల్లో స్వల్పంగా నష్టాలను చూపించడం.. మెటా కంపెనీ షేర్ల ఘోర పతనానికి కారణమై ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.
టిక్టాక్ నుంచి అటాక్..
డెయిలీ యాక్టివ్ యూజర్ల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం- చైనాకు చెందిన వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ టిక్టాక్ వంటి సామాజిక మాధ్యమాలే కారణమని మెటా యాజమాన్యం అంచనా వేస్తోంది. ఫేస్బుక్ యాక్టివ్ యూజర్లు తగ్గడానికి చైనాకు చెందిన బైట్డాన్స్ నుంచి గట్టిపోటీ కారణమని, ఈ ప్లాట్ఫామ్ నుంచి గట్టిపోటీ ఎదురవుతోందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తోన్నాయి. మళ్లీ మెటా షేర్లు పుంజుకుంటాయనడంలో సందేహాలు అక్కర్లేదని స్పష్టం చేస్తోన్నాయి.