భారీగా తగ్గిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ ధర: కొత్త రేటు ఇదే: ఆదార్, సుచిత్ర ఎల్లా ప్రకటన
ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ను రూపుమాపడానికి వినియోగిస్తోన్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర తగ్గింది. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా జాయింట్గా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఇది. దీన్ని పుణెకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ఉత్పత్తి చేస్తోంది. దేశంలో కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఈ టీకా కీలక పాత్ర పోషిస్తోంది. కోవిషీల్డ్తో పాటు హైదరాబాద్కు చెందిన టాప్ ఫార్మాసూటికల్స్ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ కూడా ఈ వ్యాక్సినేషన్లో అందుబాటులో ఉంటోంది.
18 సంవత్సరాల లోపు పిల్లలకు వేస్తోన్న టీకాల కార్యక్రమంలో కోవాగ్జిన్ మాత్రమే వినియోగిస్తోన్నారు. కోవిషీల్డ్ను ఉత్పత్తి చేస్తోన్న సీరమ్ ఇన్స్టిట్యూట్ తాజాగా ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ వ్యాక్సిన్ ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోస్ ఒక్కింటికి 600 రూపాయలను వసూలు చేస్తోన్నారు. దీన్ని 225 రూపాయలకు తగ్గించినట్లు సీరమ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆదార్ పూనావాలా తెలిపారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆయన ఓ ట్వీట్ చేశారు.
కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులను నిర్వహించిన తరువాత కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసు రేటును తగ్గించాలని నిర్ణయించినట్లు ఆదార్ చెప్పారు. ఆదార్ పూనావాలా నుంచి ఈ ప్రకటన విడుదలైన కొద్దిసేపటికే భారత్ బయోటెక్ కూడా స్పందించింది. తాము కూడా కోవాగ్జిన్ వ్యాక్సిన్ ధరను తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన అనంతరం వ్యాక్సిన్ ధరను తగ్గించినట్లు చెప్పారు.
ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవాగ్జిన్ వ్యాక్సిన్ ధర డోసు ఒక్కింటికి 1,200 రూపాయలు. దీన్ని 225 రూపాయలకు తగ్గించినట్లు సుచిత్ర ఎల్లా పేర్కొన్నారు. కోవీషీల్డ్తో పోల్చుకుంటే కోవాగ్జిన్ ధర రెట్టింపుగా ఉంటోంది. కోవీషీల్డ్ డోసు ఒక్కింటికి 600 రూపాయలు కాగా.. కోవాగ్జిన్ 1,200 రూపాయలు. తాజాగా ఆ రెండు కంపెనీల ప్రతినిధులు చేసిన ఈ తాజా ప్రకటనలతో ఈ రెండింటి రేటు కూడా డోసు ఒక్కింటికి 225 రూపాయలకు చేరినట్టయింది.