లాక్డౌన్ సడలింపులు ఎఫెక్ట్, భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
కరోనా మహమ్మారి - లాక్ డౌన్ కారణంగా స్టాక్ మార్కెట్లు గత కొంతకాలంగా భారీ నష్టాలను చూసిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ 5.0 కొనసాగుతున్నప్పటికీ అది పరిమితమే. భారీ సడలింపుల నేపథ్యంలో ఈ రోజు (జూన్ 1, సోమవారం) స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 879.42 పాయింట్లు ఎగిసి 33,303.52 వద్ద, నిఫ్టీ 245.85 పాయింట్లు ఎగిసి 9,826.15 వద్ద ముగిసింది. ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అవుతుండటంతో ఇన్వెస్టర్లు దలాల్ స్ట్రీట్ వైపు చూశారు.
LPG cylinder price: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర, నేటి నుండి రూ.100 పెంపు!
మార్కెట్కు ఇవి కలిసి వచ్చాయి
మార్కెట్లు ఉదయం మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లు ఎగిసింది. దేశీయంగా, అంతర్జాతీయంగా అన్ని దేశాలు షట్ డౌన్ నిబంధనలు సడలించి, ఆర్థిక, వ్యాపార కార్యకలాపాలు పునరుద్ధరించడం మార్కెట్ సెంటిమెంటును బలపరిచింది. దీనికి తోడు జూన్ 8వ తేదీ నుండి దేశీయంగా విధించిన లాక్ డౌన్ ఆంక్షలు మరిన్ని సడలించనున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది కూడా మార్కెట్కు కలిసి వచ్చింది.
బజాజ్ ఫైనాన్స్ టాప్ గెయినర్
మాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్, అంతర్రాష్ట్ర ప్రయాణాలు, మతపరమైన కేంద్రాలు తిరిగి అనుమతించిన నేపథ్యంలో మార్కెట్లు పుంజుకున్నాయి. సెన్సెక్స్ 30లో 25 షేర్లు భారీ లాభాల్లో ముగిశాయి. బజాజ్ పైనాన్స్ అతిపెద్ద గెయినర్గా ఉంది. ఈ షేర్ ఏకంగా 11 శాతం పెరిగి రూ.2,160కి చేరుకుంది. ఆ తర్వాత టైటాన్ 8 శాతం పెరిగింది. టాటా స్టీల్, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ 4 శాతం నుండి 7 శాతం మధ్య పెరిగాయి. టాప్ లూజర్స్ జాబితాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, భారతీ ఇన్ఫ్రాటెల్, అల్ట్రా టెక్ సిమెంట్, నెస్ట్లే, సన్ ఫార్మా ఉన్నాయి.
ఆసియా, అంతర్జాతీయ మార్కెట్లు భారీ లాభాల్లో
నిఫ్టీ స్మాల్ క్యాప్స్ వరుసగా ఐదో రోజు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ కూడా వరుసగా ఐదో రోజు లాభపడింది. స్మాల్ క్యాప్స్ 3.21 శాతం, మిడ్ క్యాప్ 3.10 శాతం లాభపడ్డాయి.ఆసియా, అంతర్జాతీయ షేర్లు మూడు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. హాంగ్ కాంగ్ మార్కెట్ 3.6 శాతం ఎగిసింది. చైనీస్ బ్లూచిప్స్ 2.2 శాతం పెరిగింది.