భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 1400 పాయింట్లు పతనం
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 50,020.91 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 50,028.67 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,580.80 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 14,837.70 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,849.85 వద్ద గరిష్టాన్ని, 14,459.50 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.11.50 సమయానికి సెన్సెక్స్ 1,275.05 (2.55%) క్షీణించి 48,754.78 పాయింట్ల వద్ద, నిఫ్టీ 352.55 (2.37%) పాయింట్లు పతనమై 14,515.35 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
అమెరికా మార్కెట్లు గతవారం లాభాల్లో ముగిశాయి. మార్చిలో అమెరికాలో నిరుద్యోగం భారీస్థాయిలో పడిపోయిందనే వార్తలు సానుకూల అంశం. దీంతో అక్కడి నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. హాంగ్కాంగ్ మార్కెట్ మాత్రం నష్టపోయింది. అయితే దేశీయంగా కరోనా కేసులు భారీగా పెరగడంతో మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. మహారాష్ట్రలో కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగానూ ఆయా రాష్ట్రాల్లో తీవ్రతను బట్టి కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి.
ఈవారం విడుదల కానున్న ఆర్బీఐ పరపతి సమీక్ష నిర్ణయాలు, కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో నేడు దేశీయ మార్కెట్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.