సెన్సెక్స్ 1128 పాయింట్లు జంప్, 50,000 మార్క్ క్రాస్: మార్కెట్ భారీ లాభాలకు కారణాలివే..
ముంబై: స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ముగిశాయి. ప్రారంభం నుండి బుల్ రంకె కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలు, కీలక రంగాల షేర్లు రాణించడం, కరోనా సెకండ్ వేవ్ భయాలు కాస్త తగ్గడం వంటి వివిధ కారణాలతో సూచీలు జంప్ చేశాయి. నేడు సెన్సెక్స్, నిఫ్టీ రెండు శాతానికి పైగా లాభపడ్డాయి. సెన్సెక్స్ మూడు రోజుల 50వేల మార్కును క్రాస్ చేసి క్లోజ్ అయింది. నిఫ్టీ 14800 ఎగువన ముగిసింది. ఐటీ, మెటల్ స్టాక్స్ ఎగిసిపడ్డాయి.
మార్కెట్ లాభాలకు కారణాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్, ఐరోపా దేశాల లాక్ డౌన్ ఆందోళనల నేపథ్యంలో ఈ వారం మార్కెట్లు నష్టపోతాయని భావించినప్పటికీ, ఎగిసిపడ్డాయి. దేశీయ సంస్ధాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరిగాయి. నాలుగో త్రైమాసిక ఫలితాలపై ఇన్వెస్టర్లు సానుకూల దృక్పథంతో కనిపించారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉన్నప్పటికీ ప్రభావం అంతగా ఉండదనే సంకేతాలు కనిపించాయి. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న సంకేతాలు మరింత బలంగా ఉన్నాయి. ఇవన్నీ ఇన్వెస్టర్ల సెంటుమెంటును బలపరిచాయి. వీటికి తోడు అంతర్జాతీయ, ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి.
సెన్సెక్స్ 1128 పాయింట్ల జంప్
ఉదయం 49,331.68 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 50,268.45 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,331.68 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. అంటే ప్రారంభంలోని 49,331.68 పాయింట్లే నేటి కనిష్టం. అంటే ఆ తర్వాత ఏ సమయంలోను సెన్సెక్స్ తగ్గలేదు. చివరకు 1,128.08 (2.30%) పాయింట్లు ఎగిసి 50,136.58 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 14,628.50 పాయింట్లు లాభపడి, 14,876.30 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,617.60 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ +337.80 (2.33%) పాయింట్లు ఎగిసి 14,845.10 పాయింట్ల వద్ద ముగిసింది.
టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో UPL 7.27 శాతం, JSW స్టీల్ 5.00 శాతం, టాటా స్టీల్ 4.32 శాతం, HDFC బ్యాంకు 4.18 శాతం, HCL టెక్ 3.89 శాతం లాభపడ్డాయి.
నేటి టాప్ లూజర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా 0.54 శాతం, యాక్సిస్ బ్యాంకు 0.41 శాతం, హిండాల్కో 0.26 శాతం, SBI లైఫ్ ఇన్సురా 0.21 శాతం, భారతీ ఎయిర్ టెల్ 0.19 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, రిలయన్స్, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి.