భారీ లాభాల నుండి ఊగిసలాట వైపు మార్కెట్లు, అదరగొడుతున్న ఐటీ స్టాక్స్
ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం(సెప్టెంబర్ 23) భారీ లాభాల్లో ప్రారంభం అయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 288.52 పాయింట్లు (0.76%) లాభపడి 38,022.60 వద్ద, నిఫ్టీ 79.80 పాయింట్స్ (0.72%) లాభపడి 11233.50 వద్ద ప్రారంభమైంది. 777 షేర్లు లాభాల్లో, 172 షేర్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. 37 షేర్లలో ఎలాంటి మార్పులేకుండా ప్రారంభమయ్యాయి. అయితే మధ్యాహ్నం గం.12 సమయానికి సెన్సెక్స్ లాభాలు 300 పాయింట్ల నుండి 4 పాయింట్లకు దిగి వచ్చింది. దీంతో తిరిగి 38వేల దిగువకు చేరుకుంది. మధ్యాహ్నం ఊగిసలాటలో కనిపించాయి.
నిప్టీలో విప్రో, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఏషియన్ పేయింట్స్ భారీ లాభాల్లో ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఈ వారంలో గత రెండు సెషన్లలో మార్కెట్లు భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ రోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఇక, డాలర్ మారకంతో రూపాయి 73.58 వద్ద ప్రారంభమైంది. అంతకుముందు సెషన్లోని ఇక్కడే క్లోజ్ అయింది.
2 లక్షలకోట్ల డాలర్లు.. ప్రపంచదిగ్గజ బ్యాంకుల్లో అక్రమ నిధుల బదలీ కలకలం, షేర్లు 1998 స్థాయికి..
టాప్ గెయినర్స్.. లూజర్స్
రిలయన్స్ ఇండస్ట్రీస్ విభాగం రిలయన్స్ రిటైల్ వెంచర్లో అమెరికా దిగ్గజం కేకేఆర్ రూ.5,550 కోట్లు ఇన్వెస్ట్ చేసి 1.28 శాతం వాటాను దక్కించుకుంది. ఈ మేరకు రిలయన్స్ ఎక్స్చేంజీలకు సమాచారం ఇచ్చింది. దీంతోరిలయన్స్ షేర్ ధర ఓ సమయంలో దాదాపు 3 శాతం లాభపడింది. మధ్యాహ్నం గం.11.15 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో ఇన్ఫోసిస్, ఐచర్ మోటార్స్, హెచ్సీఎల్ టెక్, రిలయన్స్, విప్రో ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ కార్ప్ ఉన్నాయి. టెలికం రంగ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వొడాఫోన్ ఐడియా షేర్ 4.88 శాతం, భారతీ ఎయిర్టెల్ 5 శాతం నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి.
ఐటీ స్టాక్స్ అదుర్స్
ఐటీ స్టాక్స్ ఈరోజు కూడా లాభాల్లోనే ట్రేడింగ్ ప్రారంభించాయి. ఇన్ఫోసిస్ షేర్ 2 శాతానికి పైగా ఎగిసి రూ.1,029, విప్రో షేర్ ధర 1.62 శాతం లాభపడి రూ.317 వద్ద, హెచ్సీఎల్ టెక్ షేర్ ధర 2 శాతానికి పైగా ఎగిసి రూ.838 వద్ద, టెక్ మహీంద్ర షేర్ ధర 0.24 శాతం లాభపడి రూ.802 వద్ద ట్రేడ్ అయింది. కోఫోర్జె షేర్ ధర 2.57 శాతం లాభపడి రూ.2,216 వద్ద, బిర్లా సాఫ్ట్ షేర్ ధర 1.37 శాతం లాభపడి రూ.196 వద్ద, సొనాటా సాఫ్టువేర్ 1.20 శాతం ఎగిసి రూ.337 వద్ద, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ షేర్ ధర 1.41 శాతం లాభపడి రూ.36.30 వద్ద టేర్డ్ అయింది. టీసీఎస్ 1.44 శాతం క్షీణించి రూ.2,485 వద్ద, మైండ్ ట్రీ షేర్ ధర 0.97 శాతం క్షీణించి రూ.1294 వద్ద ట్రేడ్ అయింది. ఐటీ స్టాక్స్ ఒక శాతానికి పైగా లాభపడ్డాయి.
కెమ్కాన్ ఐపీవో..
కెమ్కాన్ పబ్లిక్ ఇష్యూకు మంగళవారానికి పదమూడు రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగంలో 1.4 శాతం రెట్లు, సంపన్న వర్గాల నుండి 3.6 రెట్లు అధికంగా స్పందన లభించింది.రిటైల్ ఇన్వెస్టర్లు 13 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. ఈ రోజు ఇష్యూ ముగియనుంది. ధరల శ్రేణి రూ.338 నుండి రూ.340 మధ్య ఉంది. ఐపీవో ద్వారా రూ.318 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఐపీవోలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుండి కెమ్కాన్ స్పెషాలిటీ కెమికల్స్ రూ.95.4 కోట్లను సమకూర్చుకుంది.