నేటి గరిష్టం నుండి 700 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం (జూన్ 18) నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, ఆసియా మార్కెట్లు అప్రమత్తంగా కదలడంతో కీలక రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో ఉదయం కాస్త సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లాయి. తిరిగి ఆ తర్వాత పుంజుకున్నట్లు కనిపిస్తున్నప్పటికీ భారీ నష్టాల నుండి మాత్రమే కోలుకొని దాదాపు స్థిరంగా ముగిశాయి. సెన్సెక్స్ స్వల్ప లాభాల్లో, నిఫ్టీ స్వల్ప నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ నేటి గరిష్టం నుండి 700 పాయింట్ల మేర కూడా పతనమైంది.
సెన్సెక్స్ 52,568.07 పాయింట్ల వద్ద ప్రారంభమై,52,586.41 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,601.11 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,756.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,761.50 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,450.90 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 21.12 (0.040%) పాయింట్లు మాత్రమే లాభపడి 52,344.45 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 8.05 (0.051%) పాయింట్లు నష్టపోయి 15,683.35 పాయింట్ల వద్ద ముగిసింది.
బీఎస్ఈ 30 సూచీలో HUL, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫిన్ సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, HDFC బ్యాంక్, సన్ ఫార్మా, రిలయన్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ONGC, NTPC, మహీంద్రా అండ్ మహీంద్రా, నెస్ట్లే ఇండియా, పవర్ గ్రిడ్, ఎస్బీఐ, HCL టెక్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ముగిశాయి.