కూలిన మార్కెట్ ఆశలు: 1,100పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్, కాపాడి.. భారీగా దెబ్బకొట్టిన 'ఐటీ'
ముంబై: స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ పరిణామాలు, పెరుగుతున్న కరోనా కేసులు సహా వివిధ కారణాలతో దలాల్ స్ట్రీట్ వరుసగా ఆరో రోజు దారుణంగా పతనమైంది. ఈరోజు (సెప్టెంబర్ 24, గురువారం) సెన్సెక్స్ 1,114.82 పాయింట్లు(2.96%) నష్టపోయి 36,553.60 పాయింట్ల వద్ద, నిఫ్టీ 326.40 పాయింట్లు (2.93%) క్షీణించి 10,805.50 వద్ద ముగిసింది.
598 షేర్లు లాభాల్లో, 2009 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 155 షేర్లలో ఎలాంటి మార్పులేదు. అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. దిగ్గజ కంపెనీల స్టాక్స్ పతనమయ్యాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైనప్పటికీ, మధ్యాహ్నం లేదా సాయంత్రానికి కోలుకుంటాయని భావిస్తే, అంతకుమించి నష్టాలు చవిచూశాయి.
అతి తక్కువ ధరకే క్రూడాయిల్, భారత్ నిల్వలతో 685 మిలియన్ డాలర్ల ఆదా
వరుసగా 6వ రోజు నష్టం.. దెబ్బతీసిన ఇన్ఫీ, రిలయన్స్, టీసీఎస్
- స్టాక్ మార్కెట్లు వరుసగా 6వ రోజు నష్టాల్లో ముగిశాయి. ఏడు నెలల్లో మరోసారి భారీగా నష్టపోయింది.
- బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ రోజు రూ.3.75 లక్షల కోట్ల నుండి రూ.3.87 లక్షల కోట్ల మేర క్షీణించింది.
- గత నాలుగు నెలల కాలంలో సెన్సెక్స్, నిఫ్టీ అతిపెద్ద నష్టాలను నమోదు చేశాయి. నిఫ్టీ బ్యాంకుకు 2 నెలల్లో ఇది భారీ నష్టం.
- సెన్సెక్స్ 37వేల దిగువకు చేరుకోగా, నిఫ్టీ 11వేల దిగువకు పడిపోయింది.
- మిడ్ క్యాప్ సూచీలు 414 పాయింట్లు నష్టపోయాయి.
- ఈ రోజు మెటల్, ఐటీ, పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులు భారీగా నష్టాలను నమోదు చేశాయి.
- 48 నిఫ్టీ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫిన్ సర్వ్, గ్రాసీమ్ స్టాక్స్ తీవ్రంగా నష్టపోయాయి.
- మార్కెట్లో ఎక్కువ వాటా కలిగిన రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐసీఐసీఐ షేర్లు తీవ్రంగా దెబ్బతినడంతో మార్కెట్లు కుప్పకూలాయి.
- నిఫ్టీ బ్యాంకు 403 పాయింట్లు నష్టపోయింది. HDFC, ICICI నష్టాల్లో ముగిశాయి.
- ఎంఫయాసిస్, దివిస్, ఫెడరల్ బ్యాంకు, ఆర్బీఎల్ టాప్ మిడ్ క్యాప్ లూజర్స్.
- అపోలో హాస్పిటల్స్ లాభాల్లో ముగిసింది.
నిన్నటి వరకు అలా.. నేడు ఐటీ స్టాక్స్ దెబ్బ
- టాప్ గెయినర్స్ జాబితాలో హెచ్యూఎల్ ఉంది.
- టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్ ఉన్నాయి.
- ఓఎన్జీసీకి చెందిన గుజరాత్ ప్లాంటులోని ఓ యూనిట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో ఈ స్టాక్స్ పైన ప్రభావం పడింది. దీంతో స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. ఈ స్టాక్ 2.51 శాతం మేర నష్టాల్లో ముగిసింది.
- గత ఆరు సెషన్లుగా మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పటికీ, ఐటీ స్టాక్స్ మాత్రం లాభాల్లోకి వెళ్లాయి. కానీ రెండు రోజులుగా ఈ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
- టీసీఎస్ షేర్ 5.45 శాతం క్షీణించి రూ.2,332 వద్ద, HCL Tech షేర్ ధర 3.21 శాతం నష్టపోయి రూ.788 వద్ద, ఇన్ఫోసిస్ షేర్ ధర 4.12 శాతం క్షీణించి రూ.977.75 వద్ద, 'టెక్ మహీంద్ర షేర్ 5.05 శాతం పడిపోయి రూ.753 వద్ద, విప్రో షేర్ ధర 3.45 శాతం పడిపోయి రూ.304 వద్ద ట్రేడ్ అయింది. ఐటీ స్టాక్స్ అన్నీ కూడా 3 శాతానికి కాస్త అటు ఇటుగా భారీగా పడిపోయాయి.
- మొన్నటి వరకు మార్కెట్లో అతి భారీ నష్టాలకు బ్రేక్ వేసిన ఐటీ స్టాక్స్, ఈ రోజు అవే ఐటీ స్టాక్స్ వల్ల పెద్ద మొత్తంలో నష్టపోయాయి. దీనికి బ్యాంకింగ్ రంగ షేర్లు తోడయ్యాయి. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు వరుసగా 1.01 శాతం, 3.30 శాతం మేర క్షీణించాయి.
- టాటా మోటార్స్ షేర్ ధర దాదాపు 7 శాతం క్షీణించి రూ.122.75 వద్ద క్లోజ్ అయింది. అశోక్ లేలాండ్ షేర్ 8 శాతం క్షీణించింది.
- ఆటో స్టాక్స్ 3.44 శాతం మేర క్షీణించాయి. ఐటీ స్టాక్స్ 4.62 శాతం మేర పడిపోయాయి.
మార్కెట్ నష్టాలకు కారణాలు
ఉదయం నష్టాలతో ముగిసిన మార్కెట్లు మధ్యాహ్నం సమయానికి పుంజుకుంటాయని భావించారు. కానీ నష్టాలు అంతకంతకూ పెరిగాయి. అమెరికా ఆర్థికవ్యవస్థ మరింత దిగజారుతోందని అధికారులు ప్రకటించడం మన మార్కెట్లను దెబ్బతీసింది. అక్కడి అధికారుల ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు దెబ్బతిన్నాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది. యూరోప్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అమెరికా సహా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ప్రభావం మార్కెట్ పైన పడిది.