ఫెడ్ వడ్డీ రేటు ఎఫెక్ట్, మార్కెట్ భారీ పతనం: సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్, కారణాలివే
స్టాక్ మార్కెట్లు గురువారం (జనవరి 27, 2022) కుప్పకూలాయి. వడ్డీ రేట్లను పెంచనున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం వెల్లడించింది. ఈ ప్రభావం పసిడి పైన పడింది. అలాగే స్టాక్ మార్కెట్ పైన కూడా పెను ప్రభావం చూపింది. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈక్విటీలో అమ్మకాలు వెల్లువెత్తాయి. భారత్ సహా ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ప్రారంభంలోనే వెయ్యి పాయింట్లకు పైగా, నిఫ్టీ 300 పాయింట్లకు పైగా నష్టపోయింది.
సెన్సెక్స్ 57,000 పాయింట్ల దిగువకు, నిఫ్టీ 17,000 పాయింట్ల దిగువకు వచ్చింది. దీనికి తోడు బడ్జెట్కు ముందు సూచీలు భారీ దిద్దుబాటుకు గురవుతున్నట్లుగా కనిపిస్తోంది. రియాల్టీ, ఐటీ, ఫార్మా స్టాక్స్ కుప్పకూలాయి.
అన్ని రంగాలు నష్టాల్లోనే
అన్ని రంగాలు కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఐటీ, ఫార్మా, మెటల్, సూచీలు 2 శాతం చొప్పున నష్టాల్లో ఉన్నాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.5 శాతం నుండి 1.8 శాతం చొప్పున నష్టపోయాయి. ఉదయం గం.10 సమయానికి ఆటో, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్, ఐటీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, రియాల్టీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి. PSU బ్యాంకు సూచీలు మాత్రం కాస్త సానుకూలంగా ఉన్నాయి. ఇక డాలర్ మారకంతో రూపాయి 41 పైసలు క్షీణించి 75.18 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. మంగళవారం 74.77 వద్ద క్లోజ్ అయింది.
నష్టాలకు కారణాలు...
మార్కెట్ నష్టాలకు ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రధానంగా ఫెడ్ వడ్డీ రేటు పెంపు ప్రకటన సూచీలను నష్టాల్లోకి నెట్టింది. ఫెడ్ వడ్డీ రేటు ప్రభావం అంతర్జాతీయ మార్కెట్ పైన ప్రభావం చూపింది. అమెరికా ద్రవ్యోల్భణం గరిష్టస్థాయికి పెరిగిన సమయంలో వడ్డీ రేట్ల పెంపుకు మొగ్గు చూపుతోంది ఫెడ్. ఈ మార్చి నాటికి నెలవారీ బాండ్స్ కొనుగోలు కార్యక్రమం ముగియనున్నందున ఆ సమయంలో వడ్డీ రేట్ల పెంపుకు అవకాశముంది.
0.25 శాతం పెంచవచ్చునని తెలుస్తోంది.చమురు ధరల పెరుగుదల కూడా మార్కెట్ సెంటిమెంట్ పైన ప్రభావం చూపాయి. చమురు ధరలు ఏకంగా 90 డాలర్లకు చేరుకుంది. రష్యా-ఉక్రెయిన్ వంటి అంతర్జాతీయ ఉద్రిక్తతలు ప్రభావం చూపుతున్నాయి. అలాగే, బడ్జెట్కు ముందు మార్కెట్ దిద్దుబాటుకు గురవుతోంది.
టాప్ లూజర్స్, గెయినర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో సిప్లా, యాక్సిస్ బ్యాంకు, ఓఎన్జీసీ, భారతీ ఎయిర్టెల్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ, హెచ్సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా, నెస్ట్లే ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఐదింట మూడు టెక్ కంపెనీలు ఉండటం గమనార్హం.ఉదయం గం.10.45 సమయానికి సెన్సెక్స్ 982 పాయింట్లు క్షీణించి 56,862 పాయింట్ల వద్ద, నిఫ్టీ 290 పాయింట్లు తగ్గి 16,987 పాయింట్ల వద్ద ముగిసింది.