సెకండ్ వేవ్ ప్రభావం అంతలేదు! అవి ఆందోళనకరం: శక్తికాంతదాస్
కరోనా నుండి భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఆర్థిక సంస్థలపై సెకండ్ వేవ్ ప్రభావం అంతకుముందు అంచనాల కంటే తక్కువే ఉందన్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ప్రజల ఆరోగ్యం, ప్రాణాలపై ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఆర్థిక వ్యవస్థ మే చివరి నుండి కోలుకుంటోందన్నారు. ఆర్థిక సంస్థల నుండి డేటా లీకేజీ, సైబర్ అటాక్స్, అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు పెరగడం ఆందోళన కలిగించే అంశాలు అన్నారు.
ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి
కరోనా సెకండ్ వేవ్ కూడా భారత్ పైన తీవ్ర ప్రభావమే చూపిందని, ఏప్రిల్ నెలలో ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం తీవ్రంగానే పడిందని, కానీ మే చివరి నుండి, జూన్ ప్రారంభం నుండి కోలుకోవడం ప్రారంభించిందని చెప్పారు. గత ఏడాది ఏప్రిల్ నుండి ఈ ఏడాది మే నెల వరకు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడిందన్నారు. రోజు రోజుకు కొత్త కేసులు తక్కువగా నమోదు అవుతున్నాయని, దీంతో మే చివరి నుండి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయన్నారు. గురువారం విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక (FSR) లో శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
మొండి బకాయిలు..
బ్యాంకులకు చెందిన స్థూల నిరర్థక ఆస్తులు-జీఎన్పీఏ 2021 మార్చి చివరి నాటికి 7.5 శాతంగా ఉన్నాయని, రుణ ఆస్తుల ప్రస్తుత నాణ్యత ప్రకారం చూస్తే 2022 మార్చి చివరి నాటికి ఈ జీఎన్పీఏలు 9.8 శాతానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. పరిస్థితి మరీ ఇబ్బందికరంగా మారితే జీఎన్పీఏలు 11.22 శాతానికి చేరుకోవచ్చునని, వచ్చే సెప్టెంబర్ నాటికి జీఎన్పీఏలు 13.5 శాతానికి చేరొచ్చని జనవరి FSRలో అంచనా వేశారు.
మూలధనం ఉంది
భవిష్యత్తులో ఆటుపోట్లను తట్టుకునేలా బ్యాంకుల వద్ద మూలధనం ఉందన్నారు ఆర్బీఐ గవర్నర్. రిటైల్తో పాటు MSMEలకు ఇచ్చిన రుణాలను గమనిస్తుండాలని బ్యాంకులకు సూచించారు. కరోనా వల్ల ఈ విభాగాలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయన్నారు. మొండి బకాయిల్లో భారీ మొత్తాలు 77.9 శాతంగా ఉన్నట్లు తెలిపారు.