రూ.25 లక్షల ఇన్సురెన్స్ సహా... 19న మరో తేజాస్ ఎక్స్ప్రెస్: తత్కాల్ టిక్కెట్లు ఉండవ్
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వేస్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రయివేటు రైలు తేజాస్ ఎక్స్ప్రెస్ రెండో రైలు జనవరి 19వ తేదీన పట్టాలెక్కనుంది. ఈ రైలులో ప్రతి బోగిలోను ఆర్వో వాటర్ ఫిల్టర్లు ఉంటాయి. రైలు ఆలస్యమైతే పరిహారం లభిస్తుంది. ఒక్క గురువారం తప్ప మిగతా అన్ని రోజుల్లో ఈ సర్వీసులు నడుస్తాయి. ఈ రెండో తేజాస్ ఎక్స్ప్రెస్ రైలు అహ్మదాబాద్ - ముంబై మధ్య నడవనుంది. ఈ రైలుకు జనవరి 17న జెండా ఊపనున్నారు. కమర్షియల్ రన్ మాత్రం జనవరి 19న ప్రారంభం కానుంది.
ఆలస్యమైనా, ఇంట్లో దొంగలు పడ్డా నష్టపరిహారం... ప్రైవేట్ రైలు బంపరాఫర్లు ఇవే..
ముంబై - అహ్మదాబాద్ మధ్య నడిచే రైలులో...
తేజాస్ రైలు పూర్తి ఎయిర్ కండిషన్డ్ రైలు. ఈ రైలులో రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ చైర్ కార్స్ ఉంటాయి. ఇందులో 112 సీట్లు ఉంటాయి. ఒక్కో దానిలో 56 సీట్లు ఉంటాయి. ఒక్కో దానిలో 78 సాధారణ సీట్లతో మరో ఎనిమిది చైర్ కార్స్ ఉంటాయి. ఈ రైల్లో మొత్తం 736 మంది ప్రయాణం చేయవచ్చు. కమర్షియల్ రన్ అహ్మదాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. ముంబై - అహ్మదాబాద్ మధ్య నడిచే ఈ రైలు నడియాడ్, వడోదర, బారుచ్, సూరత్, వాపి, బోరివాలిలో ఆగుతుంది. ఈ రైలును IRCTC నిర్వహిస్తోంది. ఇదే సంస్థ ఇప్పటికే తొలి తేజాస్ను ఢిల్లీ - లక్నో మధ్య నిర్వహిస్తోంది.
రూ.25 లక్షల ఇన్సురెన్స్
ఈ రైలులో ప్రయాణించే ప్రతి ఒక్కరికి కూడా రూ.25 లక్షల ఉచిత రైలు ట్రావెల్ ఇన్సురెన్స్ వర్తిస్తుంది. అంతేకాదు, ఇంట్లో దొంగతనం జరిగినా, ప్రయాణం సమయంలో రాబరీ జరిగినా రూ.1 లక్ష ఎక్స్క్లూజివ్ ఇన్సురెన్స్ కవరేజీ ఉంది.
తత్కాల్ టిక్కెట్లు ఉండవు
రైలు ఆలస్యంగా నడిస్తే IRCTC ఒక్కో ప్రయాణీకుడికి రూ.100 కంపెన్షేషన్ కింద చెల్లిస్తుంది. ఒకవేళ రెండు గంటలకు పైగా ఆలస్యమైతే రూ.250 చెల్లిస్తుంది. ఈ రైలులో ఎలాంటి తత్కాల్ కోటా లేదా ప్రీమియం తత్కాల్ కోటా టిక్కెట్లు ఉండవు.
విశాఖ-హైదరాబాద్ సహా ఈ మార్గాల్లో ప్రయివేటు రైళ్లు
ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా 100 మార్గాల్లో 150 ప్రయివేటు ప్యాసింజర్ రైళ్లను అందుబాటులోకి తీసుకు రావాలని కేంద్రం నిర్ణయించింది. ఫిబ్రవరిలో టెండర్స్ పిలిచే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ప్రవేశపెట్టబోయే ప్రయివేటు రైలు మార్గాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన సికింద్రాబాద్ - విశాఖపట్నం కూడా ఉంది. సమాచారం మేరకు... ముంబై-కోల్కతా, ముంబై-చెన్నై, ముంబై-గువాహటి, న్యూఢిల్లీ-ముంబై, తిరువనంతపురం-గువాహటి, న్యూఢిల్లీ-కోల్కతా, న్యూఢిల్లీ-బెంగళూరు, న్యూఢిల్లీ-చెన్నై, కోల్కతా-చెన్నై, చెన్నై-జోధ్పూర్ మార్గాల్లో ప్రయివేటు రైళ్లు రానున్నాయి. అలాగే, సికింద్రాబాద్-విశాఖపట్నం,సికింద్రాబాద్-చెన్నై, ముంబై-వారణాసి, ముంబై-పుణే, ముంబై-లక్నో, ముంబై-నాగ్పూర్, పాట్నా-బెంగళూరు, పుణే-పాట్నా, చెన్నై-కోయంబత్తూరు, సూరత్-వారణాసి, భువనేశ్వర్-కోల్కతా, న్యూఢిల్లీ-పాట్నా, అలహాబాద్, అమృత్సర్, చంఢీఘర్, గోరఖ్పూర్, భాగల్పూర్ మార్గాల్లో ప్రయివేటు రైళ్లు రానున్నాయి.
మెట్రోపాలిటన్ నగరాలతోనే కనెక్టివిటీ
లాభాలు వచ్చే మార్గాల్లో ప్రయివేటు రైళ్లను తీసుకు వస్తున్నారు. ప్రతిపాదిత 100 రైలు మార్గాల్లో 35 ఢిల్లీతో కనెక్టివిటీ ఉన్నాయి. 26 మార్గాలు ముంబైతో, 12 కోల్కతాతో, 11 చెన్నైతో, 8 బెంగళూరుతో కనెక్టివిటీ ఉన్నాయి. మిగతా మార్గాలు కూడా మెట్రోపాలిటన్ సిటీలతో కనెక్టివిటీ ఉన్న మార్గాలే ఉన్నాయి.