కరోనా సెకండ్ వేవ్: ఆర్థిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం
కరోనా సెకండ్ వేవ్ 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక కార్యకలాపాలకు ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 2021 నెలవారీ సమీక్షా నివేదికలో పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా అంటువ్యాధి ఉధృతమవుతోంది. మరణాలు కూడా పెరుగుతున్నాయి. అయినప్పటికీ కరోనా ఫస్ట్ వేవ్తో పోలిస్తే సెకండ్ వేవ్ ప్రభావం కాస్త తక్కువగా ఉంటుందని అభిప్రాయపడింది. గత ఆర్థిక సంవత్సరం రెండు త్రైమాసికాలు ప్రతికూలత నమోదు చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది దేశవ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో జూన్ త్రైమాసికంలో మైనస్ 23.9 శాతం ప్రతికూలత, తర్వాత త్రైమాసికంలో మైనస్ 7.5 శాతం ప్రతికూలత నమోదు చేసింది. ఆ తర్వాత జీడీపీ వృద్ధి రేటు మూడో త్రైమాసికంలో 0.4 శాతంగా నమోదయింది.
అయితే తాజాగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత ఆర్థిక రికవరీపై కాస్త ప్రభావం చూపుతోంది. కరోనాతో కలిసి జీవించడం, అంతర్జాతీయ అనుభవం, ఆర్థిక రికవరీపై సెకండ్ వేవ్ ప్రభావం కాస్త తక్కువగా ఉంటుందని ఆర్థికమంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. ఆరోగ్య మౌలిక సదుపాయాలు పెంచడం, సరఫరా వేగవంతం చేయడం కలిసి వస్తుందని తెలిపింది.
ఇటీవల వాల్ స్ట్రీట్ బ్రోకరేజీ గోల్డ్మన్ శాక్స్ FY22లో భారత ఆర్థిక వృద్ధి రేటును 11.1 శాతానికి తగ్గించింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భారత రికవరీపై ప్రభావం పడుతుందని అంతర్జాతీయ రేటింగ్ ఎజెన్సీలు అంచనా వేస్తున్నాయి. కరోనా సమయంలోను దేశంలో వ్యవసాయ రంగం మాత్రమే చాలా ఆశాజనకంగా కనిపిస్తోంది. రాబోయే పంట కాలంలో రికార్డ్ స్థాయిలో పంట ఉత్పత్తి ఉంటుందని భావిస్తున్నారు.