Adani: సుప్రీంకోర్టు తలుపుతట్టిన సెబీ.. అదానీ-హిండెన్ బర్గ్ వ్యవహారంపై ఏమి తేల్చిందంటే..
Adani: హిండెన్ బర్గ్ రీసెర్చ్ వ్యవహారం వల్ల అదానీ గ్రూపు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పార్లమెంటులో విపక్షాలు సహా సుప్రీంకోర్టు సైతం ఈ విషయంపై స్పందించాల్సి వచ్చింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదికను సమర్పించాల్సిందిగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని సైతం అత్యున్నత న్యాయస్తానం ఆదేశించింది.
తన విచారణను పూర్తి చేయడానికి 6 నెలల పొడిగింపును కోరుతూ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో తాజాగా ఒక దరఖాస్తును దాఖలు చేసింది. సమీకరించిన ఫలితాలను ధృవీకరించుకోవడానికి మరియు దర్యాప్తును ముగించడానికి మరింత సమయం పడుతుందని అందులో పేర్కొంది. హిండెన్బర్గ్ నివేదికలోని ఆరోపణల నిర్ధారణకు కనీసం 15 నెలల సమయం పడుతుందని, కానీ 6 నెలల్లోగా పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించింది.
అదానీ-హిండెన్బర్గ్ విషయంలో పలు ప్రజా ప్రయోజన పిటిషన్లు సుప్రీం కోర్టులో ఫైల్ అయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆరోపణలపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ దర్యాప్తు చేయడానికి మార్చి 2న ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలల్లోగా విచారణను త్వరితగతిన ముగించి స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని కోరింది. అయితే హిండెన్బర్గ్ నివేదిక ప్రచురణకు ముందు నుంచి అదానీ గ్రూపునకు సంబంధించిన వ్యవహారాన్ని లోతుగా పరిశీలించడంతో ఇంకొంత సమయం కావాలని ఈరోజు సెబీ కోరింది.
నివేదికలోని ఆరోపణలు సంక్లిష్టంగా ఉన్నాయని, అనేక ఉప-లావాదేవీలు సైతం కనుగొన్నట్లు సెబీ తన అభ్యర్థనలో పేర్కొంది. మరింత కఠినమైన దర్యాప్తు కోసం ఆయా కంపెనీలు సమర్పించిన పత్రాల ధృవీకరణతో సహా వివరణాత్మక విశ్లేషణ చేయాలని వెల్లడించింది. ఇందుకోసం వివిధ మూలాల నుంచి డేటా/సమాచారాన్ని క్రోడీకరించడం అవసరం అని విన్నవించింది. విదేశాలు మరియు అంతర్జాతీయ బ్యాంకుల స్టేట్ మెంట్స్ సైతం పొందాల్సిన అవసరం ఉందని తెలిపింది. తన మధ్యంతర ఫలితాలను ఇప్పటికే నిపుణుల కమిటీకి సమర్పించినట్లు చెప్పింది.