NDTV ప్రమోటర్లకు సెబి షాక్, ఇన్సైడర్ ట్రేడింగ్లో 2 ఏళ్ళ నిషేధం
ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో ఎన్డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ సహా పలువురిపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి నిషేధం విధించింది. రెండేళ్ల పాటు సెక్యూరిటీ మార్కెట్లో వీరు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 12 సంవత్సరాల క్రితం నాటి ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో వీరు ఆయాచితంగా రూ.16.97 కోట్ల మేర లబ్ధి పొందినట్లు వెల్లడైంది. దీంతో సెబి ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, కంపెనీ దీనిని అప్పీల్ చేయనుంది.
డీబీఎస్ బ్యాంకుగా లక్ష్మీ విలాస్, రూ.25వేల కంటే ఎక్కువ విత్డ్రా చేసుకోవచ్చు
వాటిని వెనక్కిచ్చేయాలి
2006 సెప్టెంబర్ నుంచి 2008 జూన్ మధ్య కాలంలో ఇన్-సైడర్ ట్రేడింగ్కు సంబంధించి నిబంధనలను ఉల్లఘించినట్లు గుర్తించామని, దీంతో ప్రమోటర్ల పైన ఈ చర్యలు తీసుకున్నామని సెబి తెలిపింది. నాటి కేసులో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి, చట్టవ్యతిరేకంగా పొందిన రూ.16.97 కోట్ల లాభాలను వెనక్కి ఇచ్చేయాలని వారికి ఆదేశాలు జారీ చేసింది. అయితే కంపెనీ ఈ ఆరోపణలను ఖండిస్తోంది.
తక్షణం సవాలు
నిజాలను సరిగ్గా మదింపు చేయలేదని, సెబి ఆదేశాలను తక్షణం సవాలు చేస్తామనని ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ తెలిపారు. ఎన్డీటీవీ షేర్లలో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడిన మరో ఏడుగురు వ్యక్తులు, సంస్థల పైన కూడా సెబి ఏడాది నుండి రెండేళ్ల పాటు సెబి నిషేధం విధించింది. ఇందులో విక్రమాదిత్యచంద్ర, ఈశ్వరి ప్రసాద్ బాజపాయి, సౌరవ్ బెనర్జీ, సంజయ్ దత్ సతీమణి ప్రణీత దత్, క్వాంటం సెక్యూరిటీస్, ఎస్ఏఎల్ రియల్ ఎస్టేట్, తాజ్ క్యాపిటల్ పార్ట్నర్స్ ఉన్నాయి.
వడ్డీతో సహా చెల్లించాలి
2006 సెప్టెంబర్ నుంచి 2008 జూన్ మధ్య కాలంలో ఎన్డీటీవీ షేర్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు దర్యాఫ్తులో తేలింది. 2007 సెప్టెంబర్ 7న కంపెనీ పునర్నిర్మాణానికి సంబంధించి చర్చలు ప్రారంభమయ్యాయి. 2008 ఏప్రిల్ 16వ తేదీన ఈ నిర్ణయం వెలువడింది. అయితే ప్రణయ్, రాధికలు ఏప్రిల్ 17, 2008లో షేర్ల విక్రయం ద్వారా కోట్లాది రూపాయలు లాభం పొందినట్లు దర్యాఫ్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో తాజా ఆదేశాలు వచ్చాయి. 2008 ఏప్రిల్ 17వ తేదీ నుండి 6 శాతం వడ్డీతో మొత్తం కట్టాలని తెలిపింది.