SEBI New Rules: ట్రేడర్స్ ఈ విషయాలు మీకోసమే.. స్టాక్ మార్కెట్ నిబంధనల్లో కీలక మార్పులు
Sebi New Rules: స్టాక్ మార్కెట్ నిబంధనల్లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు సెబీ ప్రకటించింది. ఆఫర్ ఫర్ సేల్లో రిటైల్ మదుపర్లకూ మార్గం సుగమం చేసింది. సాంకేతిక సమస్యల కారణంగా ఎక్స్ఛేంజ్ల సేవల్లో జాప్యం నివారణకు చర్యలు తీసుకుంది.
నాన్ ప్రమోటర్లకూ ఓఎఫ్ఎస్ అవకాశం:
'ఆఫర్ ఫర్ సేల్' (ఓఎఫ్ఎస్) ద్వారా షేర్ల విక్రయానికి సంబంధించి సెబీ కొత్త నిబంధనలు జారీ చేసింది. ప్రమోటర్లు కాని వాటాదారులు సైతం తమ షేర్లు విక్రయించడానికి బాటలు వేసింది. రూ. 1000 కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీలకు ఓఎఫ్ఎస్లో పాల్గొనే అవకాశం కల్పించింది. తద్వారా ప్రమోటర్లు మాత్రమే ఇప్పటివరకు ఈ పద్ధతిని వినియోగించుకుంటుండగా.. మరింత మంది దీని ద్వారా ప్రయోజనం పొందే వెసులుబాటు ఏర్పడింది. ఫిబ్రవరి 10 నుంచి ఈ నిబంధన అమలు కానున్నట్లు వెల్లడించింది.
సాంకేతిక సమస్యలకు చెక్..
ట్రేడింగ్ సమయంలో సాధారణంగా ఎదుర్కొనే సాంకేతిక సమస్యలకు చెక్ పెట్టే విధంగా నిబంధనల్లో సెబీ కొన్ని మార్పులు చేసింది. సమస్య తలెత్తిన 15 నిమిషాల్లో ట్రేడర్స్ మరియు బ్రోకర్స్ కు ఎక్స్ఛేంజ్లు సమాచారం అందించాలని ఆదేశించింది. అంతేగాక ప్రతి 45 నిమిషాలకు సమస్య నివారణకు తీసుకుంటున్న చర్యలతో అప్డేట్స్ ఇస్తూ ఉండాలని నిర్ణయించింది. ఎక్కువ సమయం ఇబ్బంది కొనసాగితే, అనివార్య పరిస్థితుల్లో ట్రేడింగ్ సమయాన్ని సైతం పొడిగించాలని తెలిపింది.
ఏమిటీ ఓఎఫ్ఎస్:
సాధారణంగా ప్రమోటర్లు నిధులను సేకరించడానికి 'ఆఫర్ ఫర్ సేల్' మార్గాన్ని ఎంచుకుంటారు. దీని ద్వారా తమ వాటాలో కొంత భాగాన్ని ఇతర కంపెనీలు, దేశీయ మరియు విదేశీ సంస్థలకు విక్రయిస్తారు. ఆఫర్ చేస్తున్న మొత్తం షేర్లలో కనీసం 25% మ్యూచువల్ ఫండ్స్ మరియు ఇన్సూరెన్స్ కంపెనీలకు, 10 శాతాన్ని రిటైల్ పెట్టుబడిదారులకు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓఎఫ్ఎస్ ద్వారా షేర్లు విక్రయించేందుకు నాన్ ప్రమోటర్లు కనీసం 10% వాటా కలిగి ఉండాలని సెబీ గతంలో ప్రకటించింది. దానికి కొనసాగింపుగా 4 నెలల వ్యవధిలోనే తాజా నిర్ణయం వెలువడినట్లు తెలుస్తోంది.