Adani Wilmar: గౌతమ్ అదాని కంపెనీ సెబి బిగ్ షాక్: వేల కోట్ల ఐపీఓకు సడన్ బ్రేక్
ముంబై: దేశీయ కార్పొరేట్ బిగ్ షాట్ గౌతమ్ అదానికి చుక్కెదురైంది. ఆయన సారథ్యాన్ని వహిస్తోన్న అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఒకటైన అదాని విల్మార్ (Adani Wilmar) జోరుకు బ్రేక్ పడింది. అదాని విల్మార్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు అడ్డుకట్ట పడింది. పబ్లిక్ ఇష్యూకు వెళ్లకుండా బిగ్ షాక్ ఇచ్చింది. చివరి నిమిషంలో అదాని విల్మార్ ఐపీఓకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ పబ్లిక్ ఇష్యూ విలువ 4,500 కోట్ల రూపాయలు. అదాని గ్రూప్ కంపెనీల మేనేజ్మెంట్ దాఖలు చేసిన పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదనలపై రెడ్ మార్క పడింది.
అదాని విల్మార్కు బ్రేక్..
దీనితో అదాని విల్మార్ పబ్లిక్ ఇష్యూ కోసం చివరి నిమిషం వరకు ఎదురు చూసిన ఇన్వెస్టర్లకు నిరాశ ఎదురైంది. అదాని విల్మార్.. జాయింట్ వెంచర్ కంపెనీ. సింగపూర్కు చెందిన విల్మార్ గ్రూప్ కంపెనీతో కలిసి అదాని గ్రూప్ సంస్థ అధినేత గౌతమ్ అదాని దీన్ని నెలకొల్పారు. శుక్రవారం అదాని విల్మార్ పబ్లిక్ ఇష్యూకు వెళ్లగా.. సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దీన్ని అడ్డుకుంది. ఈ కంపెనీ ప్రతినిధులు దాఖలు చేసిన ప్రతిపాదనలను అబెయన్స్లో పెట్టింది.
ఆ ఆర్డర్ ప్రకారం..
ఈ విషయాన్ని సెబి తన అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. సెబి (ఇష్యూయెన్స్ ఆఫ్ అబ్జర్వేషన్ ఆన్ డ్రాఫ్ట్ ఆఫర్ డాక్యుమెంట్స్ పెండింగ్ రెగ్యులేటరీ యాక్షన్స్) ఆర్డర్-2020 ప్రకారం.. అదాని విల్మార్ పబ్లిక్ ఇష్యూను అబెయన్స్లో పెట్టినట్లు స్పష్టం చేసింది. కాగా- మార్కెట్ను రెగ్యులేట్ చేయడంలో భాగంగా సెబి గత ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన ఈ ఆర్డర్ను జారీ చేసిన విషయం తెలిసిందే. దీని కింద అదాని విల్మార్ పబ్లిక్ ఇష్యూకు బ్రేక్ వేసింది సెబి.
కనీసం 30 రోజులు..
ఈ ఆర్డర్ ప్రకారం.. సెబి ఏదైనా ఓ కంపెనీ పబ్లిక్ ఇష్యూ జారీ చేయడాన్ని పక్కన పెడితే కనీసం 30 రోజుల పాటు అది అలాగే స్తంభించిపోయి ఉంటుంది. 30 రోజులు అనేది మినిమమ్. ఆ తరువాత అది 45 రోజులు లేదా 90 రోజులు లేదా అంతకుమించి ఉంటుంది. దీని ప్రకారం చూసుకుంటే అదాని విల్మార్ ఐపీఓ మళ్లీ ఇన్వెస్టర్ల ముందుకు రావడానికి ఎంత లేదన్నా కనీసం 30 రోజుల సమయం పడుతుంది. ఆ తరువాత సెబి నిబంధనలకు ఉంటే.. అది రిలీజ్ అవుతుంది.
శుక్రవారమే వెలువడాల్సి ఉన్నా..
కాగా- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి అదాని విల్మార్ కంపెనీ భారీ లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోల్చుకుంటే.. ఈ కంపెనీ నెట్ ప్రాఫిట్ 58 శాతం మేర పెరిగింది. 728 కోట్ల నెట్ ప్రాఫిట్ను నమోదు చేసింది. ఆదాయంలో 25 శాతం పెరుగుదలను అందుకుంది. పబ్లిక్ ఇష్యూకు వెళ్లడానికి కొద్దిరోజుల కిందటే- అదాని విల్మార్ ముసాయిదా ప్రతిపాదనలను సెబి వద్ద ఫైల్ చేసింది. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే శుక్రవారమే దీనికి సంబంధించిన పబ్లిక్ ఇష్యూ వెలువడాల్సి ఉంది.
రూ.4,500 కోట్ల ఐపీఓ
చివరి నిమిషంలో సెబి దీనికి బ్రేక్ వేసింది. అబెయన్స్లో పెట్టింది. ఇది ఒకరకంగా గౌతమ్ అదానికి ఎదురుదెబ్బ తగిలినట్టుగానే పరిగణించవచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మొత్తం 4,500 కోట్ల రూపాయలను మార్కెట్ నుంచి సమీకరించుకోవాలనే లక్ష్యంతో అదాని విల్మార్ ఈ ఐపీఓను జారీ చేయాలని నిర్ణయించుకుంది. చివరి నిమిషంలో సెబి దీన్ని అడ్డుకుంది. ఈ డ్రాఫ్ట్ పేపర్లను అదాని గ్రూప్ సంస్థలు వెనక్కి తీసుకుంటాయా? లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.