20 ఏళ్ల కేసు, ముఖేష్, అనీల్ అంబానీ సోదరులకు రూ.25 కోట్ల జరిమానా
ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, నీతా అంబానీ, టీనా అంబాని సహా ఇతర కుటుంబ సభ్యులపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) రూ.25 కోట్ల పెనాల్టీ విధించింది. 2000 సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ టేకోవర్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులో సెబీ ఈ చర్యకు ఉపక్రమించింది. RIL ప్రమోటర్లుగా ఉన్న వీరు కొంతమందితో కుమ్ముక్కై 5 శాతం వాటాల స్వాధీనానికి సంబంధించిన వివరాలు ప్రకటించకపోవడం నేరంగా పరిగణించినట్లు తెలిపింది. దీంతో కంపెనీ నుండి తప్పుకునే హక్కు లేదా అవకాశం ఇతర వాటాదారులకు నిరాకరించినట్లయిందని, ఇందుకు వారిపై పెనాల్టీ విధిస్తున్నట్లు తెలిపింది.
ఇరవై ఏళ్ల క్రితం సంస్థలో 5 శాతం వాటా కంటే ఎక్కువ కొనుగోలు అంశాన్ని బయటకు వెల్లడించడానికి సంబంధించి విఫలమయ్యారని సెబీ తన 85 పేజీల ఆదేశాల్లో పేర్కొంది. ధీరూభాయ్ అంబానీ వ్యాపార సామ్రాజ్యాన్ని 2005లో ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు పంచుకున్నారు.
పీఏసీతో కలిసి ప్రమోటర్లు ఆర్ఐఎల్లో జనవరి 7, 2000లో 6.83 శాతం వాటా కొనుగోలు చేశారు. 5 శాతం కంటే ఎక్కువ వాటా కొనుగోలు చేస్తే ప్రజలకు వెల్లడించాల్సి ఉంటుంది. కానీ అలా జరగలేదని సెబీ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే సంయుక్తంగా రూ.25 కోట్ల అపరాధ ఫైన్ విధించింది.