రూ 2,000 కోట్ల కుంభకోణం: కార్వీ కి సెబీ షాక్!
హైదరాబాద్ కేంద్రంగా ఆర్థిక సేవలు, స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్, సెక్యూరిటీ డిపాజిటరీ సేవలు అందిస్తున్న ప్రముఖ కంపెనీ కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ కు మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) భారీ షాక్ ఇచ్చింది. ట్రేడింగ్ నుంచి ఈ కంపెనీ ని నిషేధించింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని సెబీ తెలిపింది. దీంతో కొత్త క్లయింట్ లను తీసుకోవటం గానీ లేదా ప్రస్తుతం ఉన్న క్లయింట్ లకు సేవలు అందించటం గానీ చేయకూడని వెల్లడించింది. సుమారు రూ 2,000 కోట్ల భారీ అవకతవకలు జరిగినట్లు గుర్తించిన సెబీ ఈ మేరకు నిర్ణయం తీసుకోంది. ఈ విషయాన్నీ ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. క్లయింట్ లు తన వద్ద తనఖా పెట్టిన సెక్యూరిటీ లను తన అనుబంధ సంస్థల ద్వారా విక్రయించినట్లు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి (ఎన్ఎస్ఈ) విచారణలో తేలింది. దీంతో ఎన్ఎస్ఈ వెంటనే సెబీ కి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన సెబీ తదుపరి చర్యలు వేగిరం చేసింది. క్లయింట్ లకు చెందిన సెక్యూరిటీ లను ఇక ముందు విక్రయించకుండా కార్విని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ట్రేడింగ్ పై నిషేధం విధించింది.
సొంత అవసరాలకు నిధులు...
తమ క్లయింట్ లకు చెందిన షేర్లను విక్రయించిన కార్వీ ... తద్వారా వచ్చిన నిధులను తన సొంత అవసరాలకు వినియోగించినట్లు సమాచారం. ఈ ప్రక్రియను తన అనుబంధ సంస్థల ద్వారా కార్వీ నిర్వహించినట్లు విచారణలో తేలింది. క్లయింట్ల కు చెందిన సెక్యూరిటీ ల తదుపరి దుర్వినియోగాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని, ఇందులో మార్కెట్ రెగ్యులేటర్ కలుగజేసుకోవాల్సిందేనని సెబీ హోల్ మెంబర్ అనంత బారువా వ్యాఖ్యానించారు. కార్వీ తాను చేసిన నిర్వాకాన్ని దాచిపెట్టేందుకు జనవరి 2019 నుంచి ఆగష్టు 2019 వరకు ఎలాంటి సమాచారం కూడా ఎన్ఎస్ఈ కి వెల్లడించలేదు.
నిగ్గు తేలిన నిజాలు...
కార్వీ కి సంబంచిన డిపాజిటరీ అకౌంట్ నెంబర్ 11458979 కి సంబంధిన సమాచారం కార్వీ దాచినప్పటికీ... దీనిని ఎన్ఎస్ఈ గుర్తించింది. తన స్వీయ పరిశీలనలో ఆ అకౌంట్లో ఉన్న సెక్యూరిటీలు అకౌంట్ నుంచి వేరే అకౌంట్లకు మారిపోతున్నాయని తెలుసుకుంది. సంబంధిత క్లయింట్ లు ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ ని కార్వీ దుర్వినియోగం చేసినట్లు తేలింది. క్లయింట్ల సెక్యూరిటీ లు తనఖాలో ఉన్నప్పటికీ వాటిని విక్రయించే అధికారం కార్వీకి ఉండదు. అయినప్పటికీ వాటిని విక్రయించి సుమారు రూ 2,000 కోట్ల నిధులను దారి మళ్లించినట్లు కార్వీ పై ఆరోపణలు వచ్చాయి.
6 అనుబంధ సంస్థలు...
కార్వీ కి సంబంధించిన సుమారు 9 అనుబంధ సంస్థలకు గాను 6 అనుబంధ సంస్థలకు అది నిధులు దారి మళ్లించినట్లు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి విచారణలో స్పష్టమైంది. ప్రాథమిక విచారణలో భాగంగా కార్వీ తన అనుబంధ సంస్థలకు బదిలీ చేసిన నిధుల విలువు రూ 1,096 కోట్లుగా ఉన్నట్లు ఎన్ఎస్ఈ గుర్తించింది. అయితే, మొత్తం మీద జరిగిన అవకతవకల విలువ మాత్రం రూ 2,000 కోట్ల మేరకు ఉండటం గమనార్హం. మరో వైపు తమ సంస్థల్లో నాలుగు సంస్థల పేరు మీద సుమారు రూ 257 కోట్ల సెక్యూరిటీ లను ఇది తనఖా పెట్టినట్లు కూడా తేలింది. అదే సమయంలో సుమారు రూ 228 కోట్ల విలువైన సెక్యూరిటీ లను కార్వీ కొనుగోలు చేసింది. దీనిపై సెబీ సమగ్ర దర్యాప్తు చేపట్టనుంది.