ఇంటి నుండి పని చేద్దాం, డబ్బు సంపాదిద్దాం.. మారిన ధోరణి! 442% పెరుగుదల
కరోనా దెబ్బతో వివిధ రంగాలు దారుణంగా దెబ్బతిని, డిమాండ్-లేమితో ఆర్థిక కార్యకలాపాలపై, ఉత్పత్తిపై పడిన ప్రభావం ఉద్యోగులకు కూడా నష్టం చేసింది. లాక్ డౌన్ కారణంగా చాలా కంపెనీలు... ముఖ్యంగా ఐటీ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) ఇచ్చాయి. ఎక్కువ సంస్థలు ఈ కొత్త విధానం ద్వారా సంతృప్తిగానే ఉన్నాయి. గత కొంతకాలంగా రిమోట్ వర్క్-WFH) కోసం సెర్చ్ చేస్తోన్న వారి సంఖ్య పెరుగుతోందట. ఫిబ్రవరి-జూలై మధ్య ఇంటి నుండి పని చేసే ఉద్యోగాల కోసం వెతికడం 442 శాతం పెరిగిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇది అత్యధికం.
రియల్ ఎస్టేట్, ఉద్యోగులు: బెంగళూరు ఐటీ క్లస్టర్ను మార్చిన వర్క్ ఫ్రమ్ హోమ్!
ఈ కొత్త విధానంపై ఆసక్తి
కరోనా వైరస్ నేపథ్యంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. ఈ వర్కింగ్ స్టైల్ను పూర్తిగా అమలు చేయాలని కొన్ని ఐటీ సంస్థలు భావిస్తున్నాయి. క్రమంగా 2025 నాటికి 75శాతం వర్క్ ఫ్రమ్ హోమ్, 25శాతం కార్యాలయంనుండి పని చేసే విధానాన్ని తీసుకు రావాలని భావిస్తున్నాయి. దీంతో చాలామంది ఉద్యోగార్థులు లేదా ఉద్యోగులు కూడా దీనిపై ఆసక్తి కనబరుస్తున్నట్లు గ్లోబల్ జాబ్ సైట్ ఇండీడ్ నివేదిక ద్వారా వెల్లడైంది.
WFHతో పెరిగిన ఉత్పత్తి
కొన్ని రంగాలు తీవ్ర ఇబ్బందులు, నష్టాల్లోకి వెళ్లాయి. అదే సమయంలో సాఫ్టువేర్ టెక్నాలజీ, హెల్త్కేర్, మార్కెటింగ్ వంటి రంగాల్లో జాబ్ పోస్టింగ్స్ పెరిగాయి. డెలివరీ పర్సన్స్, ఐటీ మేనేజర్ ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి నుండి జూలై మధ్య ఇండీడ్ ప్లాట్ఫాం నుండి వచ్చిన డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. ఇంటి నుండి పని చేస్తున్నప్పటికీ ప్రొడక్షన్ పెరగడం వంటి ప్రయోజనాలను కంపెనీలు గుర్తించాయి. కొన్ని కంపెనీల్లో ప్రొడక్షన్ పెరిగితే, మరికొన్ని కంపెనీలు టెక్నికల్ మినహా నష్టం లేదని అభిప్రాయపడుతున్నాయి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ దిశగా మరిన్ని సంస్థలు ఆలోచన చేయడానికి, దీనిని కొనసాగించేందుకు దోహదపడుతోందని అంటున్నారు. ఎందుకంటే అనవసర ఆఫీస్ ఖర్చులు కూడా తగ్గుతాయి.
ఇంటి నుండి డబ్బు సంపాదనపై..
ఈ డేటా ప్రకారం ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలను సెర్చ్ చేయడం ఫిబ్రవరి నుండి జూలై మధ్య 442 శాతం పెరిగింది. ఇలాంటి (కరోనా) క్లిష్ట పరిస్థితుల్లో రిమోట్ వర్కింగ్ అనేది ఉద్యోగులతో పాటు కంపెనీకి కూడా వ్యాపారం కొనసాగడానికి ప్రయోజనకరంగా ఉంటుందని ఇండీడ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శశికుమార్ అన్నారు. ఇంటి నుండి డబ్బు సంపాదించే (ఉద్యోగం) అవకాశల కోసం ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు.