అలా చేస్తే, వంట నూనెల ధరలు రూ.5 వరకు తగ్గే అవకాశం
వంట నూనెల ధరలకు సంబంధించి MRPని తగ్గించాలని తయారీ సంస్థలకు విజ్ఞప్తి చేసింది ఇండస్ట్రీ బాడీ సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(SEA). ఈ మేరకు సోమవారం ఎడిబుల్ ఆయిల్ తయారీదారులను కోరింది. కస్టమర్లకు ఊరట కలిగించేలా కిలోకు రూ.3 నుండి రూ.5 మేర తగ్గించాలని ఓ ప్రకటనలో కోరింది. పండుగ సీజన్ నేపథ్యంలో 2021 నవంబర్ నెలలో ఎమ్మార్పీని తగ్గించాలని కోరింది. ప్రస్తుతం దేశీయ అవసరాల్లో దిగుమతుల వాటా 60 శాతంగా ఉంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా దేశీయ మార్కెట్లో ధరలు తగ్గించాలని SEA చెబుతోంది.
ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఆయా రకాలను బట్టి వంట నూనెల సగటు ధరలు రూ.130 నుండి రూ.187 వరకు ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయంలో రూ.165గా ఉంది. కిలో పల్లి నూనె ఇప్పుడు రూ.177గా ఉంది. ఆవనూనె రూ.145 నుండి రూ.187 వరకు ఉంది. సోయా నూనె రూ.126 నుండి రూ.150 వరకు ఉంది. సన్ ఫ్లవర్ రూ.145 నుండి రూ.162 వరకు ఉంది. పామాయిల్ రూ.113 నుండి రూ.130 వరకు ఉంది.
అంతర్జాతీయంగా ఎడిబుల్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయని, దీంతో దిగుమతి ద్రవ్యోల్భణం పెరుగుతోందని, ఇది అంతిమంగా నిరుపేద భారతీయులకు భారంగా మారుతోందని పేర్కొంది. ఇటీవల రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్తతల ప్రభావం సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలపై పడిందని చెబుతున్నారు.
లా-నినా కారణంగా బ్రెజిల్లో ప్రతికూల వాతావరణం, లాటిన్ అమెరికాలో కూడా సోయా పంట గణనీయంగా తగ్గడానికి కారణమైందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం సుంకాలు తగ్గించి, సామాన్యుడిపై భారం తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాయని, ఇందుకు అనుగుణంగా కంపెనీలు ధరలను తగ్గించాలని చెబుతున్నారు.