ఆంట్రిక్స్-దేవాస్పై సుప్రీం కోర్టు ఉత్తర్వులు, నిర్మలమ్మ ఏమన్నారంటే
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టడానికి రోజులముందు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మీడియా ముందుకు వచ్చారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నిర్మలమ్మ తన రెండో బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. కరోనా, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్.. ఇలా ఒకదాని వెనుక ఒకటి ఆర్థిక వ్యవస్థపై, రికవరీపై పెను ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అందరి చూపు వచ్చే బడ్జెట్ పైన ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థికమంత్రి నేడు (జనవరి 18, 2022) మీడియా ముందుకు వచ్చారు.
అయితే, ఆంట్రిక్స్ దేవాస్ కేసు గురించి కూడా ఆమె మాట్లాడతారని కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసిన అడ్వయిజరీ ద్వారా తెలిపింది. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్, నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన దేవాస్ మల్టీమీడియా ప్రయివేట్ లిమిటెడ్కు అక్కడా షాక్ తగిలింది. ఈ సందర్భంగా ఆమె ఈ అంశం గురించి మాట్లాడారు.
ఆంట్రిక్స్-దేవాస్ కేసుపై సుప్రీం కోర్టు చాలా సమగ్రమైన ఉత్తర్వులు ఇచ్చిందని ఆమె తెలిపారు. దేవాస్-ఆంట్రిక్స్ మధ్య ఒప్పందాన్ని రద్దు చేయడానికి యూపీఏ ప్రభుత్వానికి ఆరేళ్లు పట్టిందన్నారు. ప్రైమరీ ఎండోమెంట్స్ను ఈ రకంగా విక్రయించడం, ప్రయివేటు పార్టీలకు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ లక్షణమని ఆరోపించారు. దాదాపు పదకొండేళ్ల పోరాటం తర్వాత సుప్రీం కోర్టు ఈ కేసుపై నిర్ణయం వెలువరిచిందని, అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తన స్థానాన్ని ఎలా దుర్వినియోగం చేసిందో అర్థమవుతోందన్నారు. ఇది పెద్ద ప్రాడ్ అన్నారు.