గుడ్ న్యూస్: గృహ కొనుగోలుదారులకు ఎస్బీఐ బంపర్ ఆఫర్, అలా ఐతే మీ డబ్బు వాపస్
ప్రభుత్వ రంగంలో దేశంలోనే అతి పెద్ద బ్యాంకు ఐన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)... తమ ఖాతాదారులకు ఒక శుభవార్త చెప్పింది. తమ బ్యాంకులో హోమ్ లోన్ తీసుకున్న వారికి గడువు లోగా ప్రాజెక్టు పూర్తికాకపోతే డబ్బు వాపస్ ఇస్తామంటోంది. గృహ రుణాలు తీసుకునే వినియోగదారులకు ఇది నిజంగా తీపి వార్తే. ఎందుకంటే దేశంలో వేళ కొద్దీ ప్రాజెక్టులు సమయానికి పూర్తికావటం లేదు. ఏళ్లకేళ్లు కొనుగోలుదారులు వేచి చూడాల్సి వస్తోంది. ఒప్పందం ప్రకారం బిల్డర్ సమయానికి కొనుగోలుదారుకు ఇంటిని అందించనప్పటికీ...
కట్టిన సొమ్ము మాత్రం బిల్డర్ వద్దే ఇరుక్కు పోతోంది. అలాగే బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలపై ఈఎంఐ నడుస్తూనే ఉంటుంది. అయితే, ఇకపై అలాంటి ఇబ్బందులు ఉండబోవని స్వయానా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చైర్మన్ రజనీష్ కుమార్ వినియోగదారులకు హామీ ఇస్తున్నారు. ఈ మేరకు బ్యాంకు ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. త్వరలోనే ఇది అందరికీ అందుబాటులోకి రానుంది.
హోమ్ బయ్యర్ ఫైనాన్స్ గ్యారంటీ స్కీం...
లక్షలాది మంది రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారుల ఇన్వెస్ట్మెంట్ రక్షణ కోసం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా .... హోమ్ బయ్యర్ ఫైనాన్స్ గారంటీ స్కీం అనే సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఒక వేల బిల్డర్ గడువులోగా వినియోగదారునికి ఇంటిని అందించలేకపోతే దానికి సంబంధించిన ప్రిన్సిపాల్ అమౌంట్ ను బ్యాంకు తిరిగి చెల్లిస్తుంది. ఈ పథకం బిల్డర్ నుంచి ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇచ్చేంత వరకు అమల్లో ఉంటుంది. ఈ పథకం గరిష్టంగా రూ 2.5 కోట్ల విలువ ఉన్న ఇండ్లకు వర్తిస్తుంది. అలాగే ఈ పథకంలో చేరే బిల్డర్లు తమ ప్రాజెక్ట్ పూర్తిచేసేందుకు సుమారు రూ 50 కోట్ల నుంచి రూ 400 కోట్ల వరకు రుణాలను పొందవచ్చు. అయితే, రుణాలు మంజూరు చేసే ముందు బ్యాంకు ఆ బిల్డర్ కు సంబంధించిన డ్యూ డిలీజెన్స్ చేస్తుంది.
అందరికీ ప్రయోజనం...
ఎస్బీఐ ప్రవేశపెట్టిన ఈ పథకం వల్ల అటు గృహ కొనుగోలుదారులు, ఇటు బిల్డర్లకు అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని బ్యాంకు చైర్మన్ రజనీష్ కుమార్ వెల్లడించారు. ఇది దేశ రియల్ ఎస్టేట్ రంగంపై బలమైన, సానుకూల ప్రభావాన్ని చూపగలదని అయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో చాలా ప్రాజెక్టులు సమయానికి పూర్తికాక మధ్యలో నిలిచిపోయాయని ... అలాంటి వాటికి పరిష్కారంగా దీనిని రూపొందించినట్లు తెలిపారు. దేశంలో రేరా, జీఎస్టీ అమలు, నోట్ల రద్దు వంటి అంశాల నేపథ్యంలో గృహ కొనుగోలుదారులకు సమయానికి ప్రాజెక్టులను అందించటంతో పాటు, వారి డబ్బులు ఇరుక్కుపోకుండా ఈ కొత్త పథకం రక్షణ కల్పిస్తుందని రజనీష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.
ముంబై లో తొలిసారి...
హోమ్ బయ్యర్ ఫైనాన్స్ గ్యారంటీ స్కీం ను తొలుత ముంబై నగరంలో ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సన్ టెక్ డెవలపర్స్ అనే సంస్థ తో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకొంది. ఇందులో భాగంగా మూడు ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తారు. విడతలుగా ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తారు. ఇదిలా ఉండగా ... దేశంలోనే అతిపెద్దది ఐన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా గృహ రుణాలు మంజూరు చేయటంలోనూ మిగితా బ్యాంకులతో పోల్చితే ముందుంటుంది. ఈ విభాగంలో ఎస్బీఐ 22% మార్కెట్ వాటాను కలిగి ఉంది. ప్రస్తుతం బ్యాంకు కొత్తగా గృహ ఋణం తీసుకునే వారికి 7.9% వడ్డీకే మోర్టిగేజ్ రుణాలు మంజూరు చేస్తోంది.