రుణం తీసుకునే వారికి గుడ్న్యూస్, బేస్రేటు తగ్గింపు
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) రుణ గ్రహీతలకు శుభవార్త అందించింది. పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకొని బేస్ రేటును 5 బేసిస్ పాయింట్లను తగ్గిస్తున్నట్లు సెప్టెంబర్ 14, మంగళవారం నాడు ప్రకటించింది. దీంతో బేస్ రేటు 7.45 శాతంగా ఉంటుంది. బేస్ రేటుతో అనుసంధానమైన రుణాలపై వడ్డీ రేటు మరింత తగ్గుతుంది. దీంతో ప్రైమ్ లెండింగ్ రేటును కూడా 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో రుణ రేటు 12.20 శాతానికి పరిమితమైంది. అయితే మినిమం లెండింగ్ రేటులో(MCLR) ఎలాంటి మార్పులేదు. సవరించిన బేస్ రేటు సెప్టెంబర్ 15వ తేదీ నుండి అందుబాటులోకి వచ్చింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) బేస్ రేటును నిర్ణయిస్తుంది. ఈ రేటు కంటే తక్కువకు బ్యాంకులు కస్టమర్లకు రుణాలు ఇవ్వకూడదు. అన్ని బ్యాంకులకు ఈ రేటు వర్తిస్తుంది. ప్రస్తుతం ఆర్బీఐ బేస్ రేటు 7.30 శాతం నుండి 8.8 శాతం వరకు నిర్ణయించింది. అన్ని కాలపరిమితులపై ఎంసీఎల్ఆర్ రేటు మాత్రం స్థిరంగా ఉంచింది. ఎంసీఎల్ఆర్ అంటే బ్యాంకు రుణం ఇవ్వడానికి అనుమతించబడిన కనీస రుణ రేటు.
అంతకుముందు మే నెలలో ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లను 6.70 శాతానికి తగ్గించింది. రూ.30 లక్షల వరకు తీసుకునే హోమ్ లోన్ వడ్డీ రేట్లు 6.7 శాతం నుండి ప్రారంభమవుతుందని, అలాగే రూ.30 లక్షల నుండి రూ.75 లక్షల హోమ్ లోన్ పైన వడ్డీ రేటు 6.95 శాతంగా ఉందని, రూ.75 లక్షలకు మించి తీసుకునే రుణంపై హోమ్ లోన్ వడ్డీ రేటు 7.05 శాతంగా ఉంటుందని ఎస్బీఐ ప్రకటించింది.
ఎస్బీఐ మహిళలకు కూడా స్పెషల్ కన్సెషన్ను ప్రకటించింది. మహిళా ఖాతాదారులకు మరో ఐదు బేసిస్ పాయింట్ల తగ్గింపు ఉంటుందని కూడా ఎస్బీఐ తెలిపింది. కస్టమర్లు యోనో యాప్ ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని, అప్పుడు మరో 5 బేసిస్ పాయింట్ల మేర కన్సెషన్ ఉంటుందని పేర్కొంది.
ఎస్బీఐ తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు ఫ్రాడ్ పైన కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. పది రోజుల క్రితం నాలుగు యాప్స్ వినియోగించడంపై హెచ్చరికలు జారీ చేసింది. తాము సూచించిన నాలుగు యాప్స్ను కస్టమర్లు తమ తమ మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోవద్దని సూచించింది. ఈ యాప్స్ను డౌన్ లోడ్ చేయడం వల్ల గత నాలుగు నెలల కాలంలో 150 మంది ఎస్బీఐ కస్టమర్లకు రూ.70 లక్షలకు పైగా నష్టపోయినట్లు ఎస్బీఐ తెలిపినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ యాప్స్ ద్వారా ఫ్రాడ్స్టర్స్ మీ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ యాప్స్ డౌన్ లోడ్స్ వల్ల ఇలాంటి కేసుల సంఖ్య దేశంలో పెరుగుతున్నందున కస్టమర్లు ఆ యాప్స్ను ఇన్స్టాల్ చేసుకోవద్దని హెచ్చరించింది.
ఈ మేరకు ఆ యాప్స్ను కూడా పేర్కొంది. ఎనీడేస్క్, క్విక్ సపోర్ట్, టీమ్ వ్యూయర్, మింగిల్ వ్యూ యాప్స్ను డౌన్ లోడ్ చేయవద్దని పేర్కొంది. అలాగే, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(UPI) యాప్ను వినియోగిస్తున్న సమయంలో కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది. గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా యూపీఐ కలెక్ట్ రిక్వెస్ట్ లేదా క్యూఆర్ కోడ్ను యాక్సెప్ట్ చేయవద్దని సూచించింది.