హోంలోన్ కొనుగోలుదారులకు షాక్, వడ్డీ రేట్లు పెంచిన SBI: ఎంత ఉందంటే?
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) హోమ్ లోన్ వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచింది. ఇవి ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలులోకి వచ్చాయి. హోమ్ లోన్స్ పైన కనీస వడ్డీ రేటును 0.25 శాతం పెంచింది. దీంతో కనీస వడ్డీ రేటు 6.70 శాతం నుండి 6.95 శాతానికి పెరిగింది. SBI తర్వాత మిగతా బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు ఉన్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్బీఐ రెపో రేటును తగ్గించడం, డిమాండ్ పెంచేందుకు రెపో రేటు తగ్గింపు నిర్ణయానికి అనుగుణంగా వడ్డీ రేట్లు తగ్గించడం చేశాయి బ్యాంకులు. ఇప్పుడు రికవరీ కనిపిస్తుండటంతో ఎస్బీఐ వడ్డీ రేటును పెంచుతూ మొదటి అడుగు వేసింది.
bank and Share Market Holiday: ఏప్రిల్ నెలలో బ్యాంకు, షేర్ మార్కెట్ సెలవులు ఇవే
వడ్డీ రేటు ఆఫర్ ఇచ్చి.. ఇప్పుడు పెంపు
SBI మార్చి 1, 2021వ తేదీ నుండి కనీస వడ్డీ రేటును 6.80 శాతం నుండి 6.70 శాతానికి తగ్గించింది. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. SBIతో పాటు HDFC బ్యాంకు సహా పలు బ్యాంకులు గత మార్చి నెలలో వడ్డీ రేటును తగ్గిస్తూ ఆఫర్ ఇచ్చాయి. మార్చి 1 నుండి మార్చి 31 వరకు ఈ వడ్డీ రేటు వర్తించింది. ఇప్పుడు ఎస్బీఈ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది. బ్యాంకు కన్సాలిడేటెడ్ ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తుంది. మొత్తం లోన్ అమౌంట్లో ఇది 0.40 శాతంగా ఉంటుంది. జీఎస్టీ అదనం. కనీసం రూ.10,000, గరిష్టం రూ.30,000తో పాటు జీఎస్టీ ఉంటుంది.
ప్రాసెసింగ్ ఫీజు
ప్రాసెసింగ్ ఫీజు లోన్ అమౌంట్లో 0.40 శాతంగా ఉంటుంది. టైటిల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ (TIR), వ్యాల్యుయేషన్ అవసరమైతే సాధారణ ఛార్జీలు వర్తిస్తాయని ఎస్బీఐ తన వెబ్ సైట్లో తెలిపింది. కరోనా నేపథ్యంలో ఎస్బీఐ ఇంతకుముందు మార్చి 31, 2021 వరకు హోమ్ లోన్ పైన ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. రికవరీ నేపథ్యంలో ఇక నుండి ప్రాసెసింగ్ ఫీజు ఉండనుంది.
పదేళ్లు...
తమ హోమ్ లోన్ పోర్ట్ఫోలియోను వచ్చే అయిదేళ్ల కాలంలో రెడింతలు చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న దాంతో రెట్టింపు చేసుకొని రూ.10 లక్షల కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. హోమ్ లోన్ పోర్ట్ పోలియో 2011లో 89,000 కోట్లుగా ఉండగా 2021లో రూ.5 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే పదేళ్ల సమయం పట్టింది.