ఎస్బీఐపై ఘాటు విమర్శల సునామీ: గర్భిణులపై ఆ వివాదాస్పద ఉత్తర్వులు వెనక్కి
ముంబై: దేశంలో లీడ్ బ్యాంక్గా కొనసాగుతోన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఘాటు విమర్శలను సునామీని ఎదుర్కొంది. బ్యాంకు నిర్వహించే ఉద్యోగాల నియామకాల్లో గర్భిణులను తీసుకోబోమని, వారిని తాత్కాలికంగా అన్ఫిట్ అంటూ జారీ చేసిన ఉత్తర్వులు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. నియమ నిబంధనల ప్రకారం.. ఉద్యోగాల్లో చేరడానికి వారిని గర్భిణులను ఎంపిక చేసిన తరువాత కూడా తాత్కాలికంగా అన్ఫిట్గా గుర్తించేలా ఇదివరకు ఈ ఉత్తర్వులను జారీ చేసింది.
ఉద్యోగ సంఘాలు సైతం
దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో వెనక్కి తగ్గింది ఎస్బీఐ. ఆ ఉత్తర్వులను అబెయన్స్లో పెడుతున్నట్లు తాజాగా ప్రకటించింది. మూడు నెలలకు మించిన గర్భిణులు.. ఉద్యోగంలో చేరడానికి ఎంపికైన తరువాత కూడా సర్వీసుల్లో జాయిన్ అవ్వకుండా ఇదివరకు మార్గదర్శకాలను జారీ చేయడం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. మహిళా సంఘాలు మండిపడ్డాయి. అఖిల భారత బ్యాంక్ ఉద్యోగ సంఘాల సమాఖ్య సైతం అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.
స్వాతి మలివాల్ నోటీసులు..
మహిళా కమిషన్ సైతం ఈ విషయంలో జోక్యం చేసుకుంది. ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మలివాల్ ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. దీనిపై ఎస్బీఐకి నోటీసులను సైతం పంపించారు. గర్భిణుల పట్ల వివక్షతను ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. ఎస్బీఐ జారీ చేసిన తాజా మార్గదర్శకాలు చట్టవిరుద్ధమైనవిగా పేర్కొన్నారు. చట్ట ప్రకారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించిన మార్గదర్శకాలకు ఈ ఉత్తర్వులు పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు. పలు మహిళా సంఘాలు సైతం ఎస్బీఐకి రెప్రజెంటేషన్స్ను పంపించాయి.
25 శాతం మహిళలే..
వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఎస్బీఐ- తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు దీనికి సంబంధించిన ఓ ప్రకటనను కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. మహిళల పట్ల తాము ఎలాంటి వివక్షతను ప్రదర్శించట్లేదని, తమ బ్యాంకుల్లో పని చేసే ఉద్యోగుల్లో 25 శాతం మహిళలేనని పేర్కొంది. మహిళల సాధికారతకు తాము కట్టుబడి ఉన్నామని, వారి హక్కులను గౌరవిస్తామని తెలిపింది.
ఆ మార్గదర్శకాల పునఃసమీక్ష
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో గర్భిణులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పించామని గుర్తు చేసింది. ఉద్యోగం చేయడాికి ఎంపికైన మహిళలు.. మూడు నెలల గర్భధారణ కాలాన్ని మించి ఉంటే వారిని తాత్కాలికంగా అన్ఫిట్గా గుర్తించామని, ప్రసవించిన నాలుగు నెలల తరువాత ఉద్యోగంలో చేరడానికి అనుమతి ఇస్తామంటూ అప్పట్లో నిబంధనలను జారీ చేశామని పేర్కొంది. ఆ నిబంధనలను ఉపసంహరించుకుంటున్నామని స్పష్టం చేసింది. వాటిని పునఃసమీక్షించుకున్నామని వివరించింది. గర్భిణులు ఉద్యోగంలోకి ఎంపికైన వెంటనే వారు జాయిన్ అయ్యేలా మార్గదర్శకాలను రూపొందిస్తామని పేర్కొంది.