SBI customer Alert: KYC ఫ్రాడ్, అప్ డేట్ లింక్ వస్తే డబ్బు హుష్కాకి!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు ఖాతా ఉందా? వాట్సాప్లో KYC అప్ డేట్ చేసుకోవాలని సందేశం వచ్చిందా? అయితే జాగ్రత్తగా ఉండండి. ఆ మెసేజ్లోని లింక్ పైన క్లిక్ చేస్తే మీ ఖాతాలోని డబ్బులు మొత్తం మాయం అవుతాయి. ఎస్బీఐ అకౌంట్ హోల్డర్లను లక్ష్యంగా చేసుకొని కొందరు చైనా హ్యాకర్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. కేవైసీ అప్ డేట్, ఉచిత్ గిఫ్ట్స్ అంటూ నకిలీ లింక్స్ పంపిస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీకి చెందిన సైబర్ పీస్ ఫౌండేషన్, ఆటోబాట్ ఇన్ఫోటెక్ సంస్థలు ఇటీవల జరుగుతున్న సైబర్ నేరాలను బయటపెట్టి, కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేశాయి.
సైబర్ నేరగాళ్లు మొదట మన ఫోన్కు కేవైసీ వెరిఫికేషన్ అని సందేశం పంపిస్తారు. లింక్ పైన క్లిక్ చేస్తే ఎస్బీఐ ఆన్లైన్ పేజ్లాగే ఉండే ఓ పేజీ కనిపిస్తుంది. మన ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మరో పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ పేరు, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ డే వంటి వివరాలు అడుగుతుంది. అవి ఫిల్ చేయగానే మళ్లీ ఓటీపీ వచ్చిన పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ లాగిన్ బటన్ కనిపిస్తుంది.
ఆ బటన్ నొక్కగానే కేవైసీ పేజీ ఓపెన్ అయి బ్యాంకు ఖాతా యూజర్నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. ఈ పేజీలన్నీ అచ్చంగా ఎస్బీఐ ఆన్లైన్ పేజీలా ఉంటాయి. కేవైసీ అప్డేట్తో పాటు హ్యాకర్లు మరో నకిలీ లింక్స్ను పంపిస్తున్నారు. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఎస్బీఐ ఫొటోతో ఓ కంగ్రాచ్యులేషన్స్ సందేశం వస్తుంది. ఆ తర్వాత సర్వేలో పాల్గొంటే రూ.50లక్షల గిఫ్ట్స్ గెలుచుకోవచ్చునని సందేశం కన్పిస్తుంది. దీని కోసం క్లిక్ చేస్తే వ్యక్తిగత వివరాలు అడుగుతుంది. ఇలా నకిలీ లింక్స్తో హ్యాకర్లు వ్యక్తిగత సమాచారం సేకరించి బ్యాంకు ఖాతాల నుంచి సొమ్ము కాజేస్తున్నారు. ఈ లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.