మీరు బ్యాంకులో డిపాజిట్ చేస్తే నవంబర్ 1 నుంచి షాక్ తప్పకపోవచ్చు!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకు దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్, ఇతర డిపాజిటర్ల వడ్డీ రేట్లను నవంబర్ 1వ తేదీ నుంచి మార్చనుంది. రూ.1 లక్ష వరకు సేవింగ్ అకౌంట్స్ డిపాజిట్లపై వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. వచ్చే నెల నుంచి (నవంబర్ 1) ఎస్బీఐ సేవింగ్ అకౌంట్ హోల్డర్స్ వడ్డీ రేటు 3.5 శాతం నుంచి 3.25 శాతానికి తగ్గనుంది. బ్యాంకుకు తగినంత లిక్విడిటీ ఉంది. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లు తగ్గించాలని ఎస్బీఐ నిర్ణయించింది.
అక్టోబర్ 31 వరకే మీకు ఛాన్స్, నవంబర్ 1 నుంచి వడ్డీ రేటు తగ్గుతుంది!
6.4 శాతానికి తగ్గించిన ఎస్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పలుమార్లు రెపో రేటును తగ్గించింది. దీంతో ఎస్బీఐ లోన్లు తీసుకునే కస్టమర్లకు ఊరటను ఇస్తూ వడ్డీ రేట్లు తగ్గించింది. అదే సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. ప్రస్తుతం రెపో రేటు 5.15 శాతంగా ఉంది. దీంతో ఎస్బీఐ రెండేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ రేటును 0.10 శాతం తగ్గించి 6.4 శాతానికి తగ్గించింది. అంతకుముందు ఇది 6.5 శాతంగా ఉంది. వడ్డీ రేట్ వివరాలు తెలుసుకునేందుకు కస్టమర్లు బ్యాంకు వెబ్సైట్ సందర్శించవచ్చు.
0.30 శాతం కోత
ఎస్బీఐ రూ.2 కోట్లకు పైగా ఉన్న డిపాజిట్ అకౌంట్ల పైన కూడా వడ్డీ రేటును తగ్గించింది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో 0.30 శాతం కోత విధించింది. దీంతో వడ్డీ రేటు 6 శాతంగా లభించనుంది. ఇంతకుముందు 6.30 శాతంగా ఉంది. రూ.1 లక్ష వరకు డిపాజిట్స్ ఉన్న అకౌంట్లకు నవంబర్ 1వ తేదీ నుంచి 3.25 శాతం వడ్డీ మాత్రమే లభిస్తుంది.
ఆర్బీఐ ఆదేశాలతో...
ఆర్బీఐ సూచించిన ఏదో ఒక బాహ్య బెంచ్ మార్క్కు లోన్లను లింక్ చేయాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ బాహ్య బెంచ్ మార్కుల్లో రెపో రేటుతో పాటు వివిధ ఆప్షన్స్ ఉన్నాయి. బాహ్య బెంచ్ మార్క్తో రుణాలు లింక్ చేసిన వివిధ బ్యాంకులు వడ్డీలను తగ్గించాయి. ఆర్బీఐ రెపో రేటు వరుసగా తగ్గించిన నేపథ్యంలో పలు బ్యాంకులు రుణ రేట్లను తగ్గించాయి.