ఆరామ్కో లాభాలు సగం పడిపోయాయి, కారణాలివే
ప్రపంచ చమురు దిగ్గజం సౌదీ ఆరామ్కో ప్రాఫిట్ 2020లో 45 శాతం మేర పడిపోయాయి. గత ఏడాది కరోనా కారణంగా చమురు డిమాండ్ తగ్గడంతో పాటు ధరలు కూడా భారీగా క్షీణించాయి. ఈ రెండింటి ప్రభావం ఆదాయం, లాభాలపై పడింది. సౌదీ అరామ్కో గత ఏడాది లాభాలు దాదాపు సగానికి పడిపోయి 49 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కరోనా నేపథ్యంలో చమురు ధరలు, ఉత్పత్తి తగ్గడమే ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది.
2019 డిసెంబర్ నెలలో పబ్లిక్ ఇష్యూకు వచ్చిన అనంతరం సౌదీ అరామ్కోకు ఇవి రెండో వార్షిక ఫలితాలు. 2018లో అరామ్కో 111.2 బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించగా, 2019లో 88.2 బిలియన్ డాలర్లకు తగ్గింది. 2020లో మరింత క్షీణించి 49 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ప్రపంచంలో అతిపెద్ద క్రూడ్ ఎగుమతిదారు సౌదీ అరేబియా. ధరలు తగ్గడం, డిమాండ్ లేకపోవడంతో ఉత్పత్తిలో కోత కారణంగా ఆదాయం తగ్గింది.
కరోనా కారణంగా గత ఏడాది క్రూడాయిల్ ధరలు దశాబ్దాల కనిష్టానికి చేరుకున్నాయి. అయితే వ్యాక్సీన్ రావడంతో క్రమంగా కోలుకుంటున్నాయి. ఇటీవల బ్యారెల్ 70 డాలర్లను దాటింది. ప్రస్తుతం 60 డాలర్లకు పైన ఉంది. ఇదిలా ఉండగా, ముందుగా ప్రకటించినట్లు కంపెనీ వాటాదారులకు అయిదేళ్లపాటు ఏడాదికి 75 బిలియన్ డాలర్ల చొప్పున డివిడెండ్ ఇస్తామని తెలిపింది. 98 శాతం వాటాలు ప్రభుత్వం ఆధీనంలో ఉండటంతో ఎక్కువ మొత్తం సౌదీ ప్రభుత్వానికి వెళ్తుంది.