చైనా ఫోన్ల దెబ్బ... విల విల లాడుతున్న ఒకప్పటి దిగ్గజం.. ఎందుకంటే!
రంగం ఏదైనా చైనా తో పోటీ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అంత బలమైన దేశంగా ఆవరించింది చైనా. ఇప్పుడు తాత్కాలికంగా కరోనా వైరస్ దెబ్బకు సతమతమవుతోంది కానీ... ఆ దేశం కొట్టే దెబ్బకు ఎన్ని దేశాలు తల్లడిల్లయ్యో తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆ దేశానికి చెందిన కంపెనీలు చైనా వాల్ దాటి ప్రపంచాన్ని జయించటానికి దండెత్తివస్తున్నాయి. రావటమే కాదు. కార్పొరేట్ యుద్ధంలో గెలుస్తున్నాయి కూడా. ఇందుకు మన భారత దేశం కూడా మినహాయింపు కాదు. ఇండియాలో మొబైల్ ఫోన్లు రంగ ప్రవేశం చేసినప్పుడు నోకియా, సామ్ సాంగ్, మోటోరోలా వంటి కంపెనీలు బలంగా ఉండేవి.
ఒక దశలో నోకియా దేశీయ ఫోన్ల మార్కెట్ ని ఏలింది. కానీ, డ్యూయల్ సిమ్, స్మార్ట్ ఫోన్ రెవల్యూషన్ ను సమయానికి అందుకోలేక పోటీలో వెనుక బడి పోయింది. అదే సమయంలో రెండో స్థానంలో ఉన్న సామ్ సాంగ్ మాత్రం విజృంభించి కొత్త స్మార్ట్ ఫోన్ల ను రంగంలోకి దించి ఇండియన్ స్మార్ట్ ఫోన్ రంగాన్నిఏక ఛత్రాధిపత్యంతో ఏలేసింది. కానీ, ఎవరికీ ఏదీ శాశ్వతం కాదు అన్న సామెత ఇప్పుడు సామ్ సాంగ్ కు కూడా వర్తిస్తోంది. చైనా ఫోన్ల దెబ్బకు ఇప్పుడు ఈ కొరియా కంపెనీ కి దిమ్మ తిరిగిపోతోంది. నానాటికి తన స్థానాన్ని కోల్పోతోంది.
మూడో స్థానానికి పతనం...
నిన్న మొన్నటి వరకు స్మార్ట్ ఫోన్ల మార్కెట్ లీడర్ గా ఉన్న సామ్ సాంగ్ ... ప్రస్తుతం ఇండియా లో మూడో స్థానానికి పడిపోయింది. భారత దేశంలోకి షావోమి రాకతో సామ్ సాంగ్ కు కష్టాలు మొదలయ్యాయి. మొట్ట మొదటి సారి 2017 లో షావోమి దేశంలో నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ కంపెనీగా అవతరించింది. రెడ్ మీ ఫోన్ల విప్లవంతో అది సాధ్యమైంది. ఇక 2019 వచ్చే నాటికి వివో దేశంలో రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ కంపెనీగా అవతరించింది. దీంతో సామ్ సాంగ్ మూడో స్థానానికి పరిమితమైంది. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ లో ఒక కథనం ప్రచురితమైంది. ఇప్పటికే పోటీ తీవ్రతరమైన నేపథ్యంలో ఒప్పో, రియల్ మీ మరింత గా సామ్ సాంగ్ ను ఇబ్బందికి గురి చేస్తున్నాయి. వన్ ప్లస్ వంటి కంపెనీలు కూడా వేగంగా దూసుకు వచ్చి సామ్ సాంగ్ కు సవాళ్లు విసురుతున్నాయి.
తక్కువ అంచనా వేసింది..
చైనా ఫోన్ల కంపెనీలు ఇండియాలో ప్రవేశించిన సమయంలో సామ్ సాంగ్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఆ చైనా ఫోన్లే కదా.. ఎవరు కొంటారులే అనే దృక్పథంతో ఉండేది. కానీ ఒక్కో మెట్టే ఎక్కుతూ చైనా కంపెనీలు సామ్ సాంగ్ కిరీటాన్ని కైవసం చేసుకునేంతవరకు దానికి వాటి బలమెంతో అర్థం కాలేదు. సహజంగా చైనా కంపెనీలు కొత్తగా ఏదైనా మార్కెట్లోకి ప్రవేశిస్తే ... తొలుత ఆ మార్కెట్లో ఉన్న గ్యాప్ ఏమిటో తెలుసుకుంటాయి. ఇండియా లో అప్పుడు ప్రైస్ గాప్ కనిపించింది. సరైన ఫీచర్లున్న స్మార్ట్ ఫోన్ కావాలంటే రూ 20,000 పెట్టాల్సిన పరిస్థితిలో చైనా ఫోన్లు రూ 10,000 కే వినియోగదారులు ఊహించిన దానికంటే మెరుగైన ఫీచర్లను అందించాయి. కస్టమర్లు తొలుత చైనా బ్రాండ్ కొనుగోలు కు ముందుకు రాలేదు. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లతో కలిసి రెడీమి లాంటి సంస్థలు ఎక్సక్లూజివ్ టై-అప్స్ పెట్టుకుని భారీ ఆఫర్లను గుప్పించాయి. దాంతో మార్కెట్ డైనమిక్స్ ఒక్కసారిగా మారిపోయాయి.
10 బిలియన్ డాలర్ల పెట్టుబడి...
సుమారు 20 ఏళ్ళ నుంచి ఇండియా లో కార్యకలాపాలు సాగిస్తున్న సామ్ సాంగ్ ... మన దేశంలో భారీగానే పెట్టుబడి పెట్టింది. న్యూ ఢిల్లీ సమీపంలో ని నోయిడా లో ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్ల తయారీ ఫ్యాక్టరీ నెలకొల్పింది. అలాగే హైదరాబాద్ లో అతి పెద్ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డీ) కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మొత్తంగా ఇండియా లో ఇప్పటివరకు 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ 70,000 కోట్లు) పెట్టుబడి పెట్టింది. అయితే, సామ్ సాంగ్ కు ఇప్పుడు కరోనా వైరస్ పుణ్యమా అని ఒక అద్భుతమైన అవకాశం లభించిందని అనలిస్టులు పేర్కొంటున్నారు. తనకున్న 5జి, 4జి టెక్నాలజీ తో మార్కెట్లో ధరల అంశాన్ని సరిగ్గా అడ్రస్ చేస్తే... సామ్ సాంగ్ తిరిగి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవటం పెద్ద కష్టమేమి కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా ఫోన్ల కంపెనీలకు ప్రస్తుతం ఆ దేశం నుంచి కొన్ని కీలక విడి భాగాల సరఫరా నిలిచిపోయిందని, దానిని సామ్ సాంగ్ సరిగ్గా ఉపయోగించుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.