కరోనా ముందుస్థాయికి వేతన పెంపు, హైదరాబాద్లో ఎలా ఉందంటే?
భారత్లో సగటు వేతన పెంపు ప్రస్తుత ఏడాది 8.13 శాతానికి చేరుకోవచ్చునని టీమ్ లీజ్ తన జాబ్స్ అండ్ శాలరీ ప్రీమియర్ రిపోర్ట్ నివేదిక-FY22లో వెల్లడించింది. తద్వారా దాదాపు కరోనా ముందుస్థాయికి చేరుకుంటుందని వెల్లడించింది. కోవిడ్ 19 నుండి దేశం క్రమంగా కోలుకుంటుందని, దీంతో క్రమంగా ఉద్యోగాలు పెరుగుతున్నాయని పేర్కొంది. గత రెండేళ్ల తరహాలో కాకుండా ఈ ఏడాది అన్ని రంగాల్లో కూడా ఉద్యోగాలలో వేతన పెంపును ఇచ్చినట్లు టీమ్ లీజ్ తన నివేదికలో తెలిపింది.
14 రంగాల్లో వేతన పెంపు
అయితే ఈ వేతన పెంపు మోస్తారుగానే ఉండవచ్చునని పేర్కొంది. ఈ మేరకు టీమ్ లీజ్ 17 రంగాలను సమీక్షించగా, 14 రంగాల్లో వేతన పెంపు సగటున 8.13 శాతంగా ఉండవచ్చునని అభిప్రాయపడింది. వేతన పెంపు రెండంకెలకు చేరుకోవాల్సి ఉందని తెలిపింది. కరోనా ప్రారంభమయ్యాక గత రెండేళ్లుగా వేతన తగ్గింపు లేదా శాలరీ ఇంక్రిమెంట్ నిలిపివేత ఇప్పుడు లేదని, ఇది చివరి దశకు వచ్చిందని, అన్ని రంగాల్లో కూడా కరోనా ముందుస్థాయికి వేతన పెంపు కనిపిస్తోందని తెలిపింది.
కొత్త తరం ఉద్యోగాలకు డిమాండ్
భారత కార్పోరేట్ రంగం కొత్త తరం ఉద్యోగాలపై దృష్టిని కొనసాగించడం ఆసక్తికర అంశమని తెలిపింది. ఈ కొత్త రంగాలే వ్యాపారాలను ముందుకు నడిపిస్తున్నాయని, 2021-22లో తొమ్మిది రంగాల్లోకి ఇవి విస్తరించినట్లు తెలిపారు. తొమ్మిది నగరాల్లో పదిహేడు రంగాల్లోని 2,63,000 మంది అభ్యర్థుల వేతనాలను పరిశీలించి, ఈ నివేదికను రూపొందించారు. స్పెషలైజ్డ్ ఉద్యోగ హోదాలకు డిమాండ్ ఉందని తెలిపింది. ఈ విభాగంలో వృద్ధి 11 శాతం నుండి 12 శాతం మేర కనిపించిందని తెలిపింది.
హైదరాబాద్ అదుర్స్
అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, పుణేలలో 12 శాతం కంటే అధిక వేతన పెంపులు కనిపించాయని, ఇందులో ఈ-కామర్స్ టెక్ స్టార్టప్స్, హెల్త్ కేర్, ఐటీ సేవల వంటి వాటిలో వేతన పెంపు పది శాతం కంటే ఎక్కువగా ఉందని తెలిపింది. వ్యవసాయం, వాహన, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు-బీమా, బీపీవో-ఐటీ, నిర్మాణ-స్థిరాస్తి, విద్య, ఎఫ్ఎంసీజీ, హాస్పిటాలిటీ, పారిశ్రామిక తయారీ, మీడియా-వినోదం, విద్యుత్-ఇంధనం, రిటైల్, టెలికం తదితర రంగాల్లో ఇంక్రిమెంట్లు పది శాతం లోపు ఉన్నాయి.