Fed Rate Effect: ఫెడ్ నిర్ణయాలతో రూపాయి రికార్డు స్థాయికి పతనం.. డాలర్ కొరత.. మాంద్యం వస్తుందా..?
Fed Rate Effect: అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ మరో సారి ప్రమాద ఘంటికలు మోగించింది. వరుసగా మాడోసారి కూడా వడ్డీ రేట్లను 75 పాయింట్ల మేర పెంచి ప్రపంచానికి షాక్ ఇచ్చింది. దీంతో ప్రపంచ దేశాల మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. నిపుణులు సైతం ఈ ధోరణి వల్ల ఆర్థిక వృద్ధి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్వక్తం చేస్తున్నారు. ఈ కారణంగా నేడు భారత స్టాక్ మార్కెట్లు సైతం నష్టాల్లో ప్రారంభమై ట్రేడింగ్ కొనసాగుతున్నాయి.
20 ఏళ్ల గరిష్ఠానికి డాలర్..
భారత రూపాయి ఈరోజు ఉదయం ట్రేడింగ్ ప్రారంభించిన వెంటనే అమెరికా డాలర్తో పోలిస్తే 42 పైసలు పడిపోయి 80.38 కనిష్ఠానికి చేరుకుంది. అంతకుముందు బుధవారం, US డాలర్తో పోలిస్తే భారత రూపాయి 79.9750 వద్ద ముగిసింది. రూపాయి విలువ కనిష్ట స్థాయికి చేరిన వెంటనే కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అమెరికా వడ్డీ రేట్ల పెంపు ప్రకటనతో బలపడిన డాలర్ 20 ఏళ్ల రికార్డు స్థాయికి చేరుకుంది.
మాంద్యాన్ని అడ్డుకునేందుకు..
ప్రమాదకర స్థాయిలకు చేరుకున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే క్రమంలో US సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 0.75 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ బెంచ్మార్క్ ఫండ్స్ రేటు వరుసగా మూడవ పెరుగుదల తర్వాత 3% నుంచి 3.25%కి పెరిగింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం 2023 నాటికి వడ్డీ రేట్లు 4.6 శాతానికి పెరగవచ్చు. ఇది మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
డాలర్ ఎందుకు బలపడుతోంది?
కరోనా మహమ్మారి తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగానే ఉంది. అక్కడ ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది. ఉపాధి పరిస్థితి కూడా బలంగా ఉంది. ఇది కాకుండా ఇతర రంగాలు కూడా బాగా రాణిస్తున్నాయి. అయితే రష్యా-ఉక్రెయిన యుద్ధం తర్వాత పరిస్థితులు వేగంగా మారాయి. ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుకుని టెక్నిగల్ గా అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మాంద్యంలోకి జారుకుంది. ఈ కారణంగా 2008 తర్వాత తొలిసారిగా అమెరికా రేట్ల పెంపు విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటోంది, దీని కారణంగా డాలర్ నిరంతరం బలపడుతోంది.
డాలర్ బలపడితే మనకొచ్చే నష్టం ఏంటి..?
ఉదాహరణకు ఇప్పుడు ఎవరైనా అమెరికా వెళ్లాలని అనకుంటే డాలర్లు కొనాలి కాబట్టి అధి ఎక్కువ ఖర్చు చేస్తుంది. చాలా మందికి విదేశీ విద్య సైతం భారంగా మారనుంది. భారత్ అనేక దిగుమతులకు డాలర్ల రూపంలో చెల్లింపులు చేయవలసి ఉంటుంది కాబట్టి అవి మరింతగా ఖరీదైనవిగా మారి.. వస్తువులు, ఉత్పత్తుల ధరలు మరింతగా పెరుగుతాయి. ఇది మాత్రం దేశంలో ఎగుమతులు చేసే ఐటీ, చమురు, ఇతర కంపెనీలకు మాత్రం రాబడిని పెంచి మంచి ఆదాయాన్ని ఇస్తుంది. మరో పక్క వాణిజ్య లోటు పెరగటానికి కూడా కారణం కావచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు.