డిసెంబర్ నుండి 24x7 RTGS, ఆన్లైన్ వ్యాపారం పెరుగుతోంది: ఆర్బీఐ గవర్నర్
ముంబై: కరోనా వైరస్పై పోరులో భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు నిర్ణయాత్మక దశలోకి ప్రవేశించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపో రేటును 3.35 శాతంగా కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో పాటు మరికొంతకాలం పాటు అకామిడేటివ్ విధానం కొనసాగిస్తామని దాస్ తెలిపారు.
FY21లో జీడీపీ 9.5% ప్రతికూలత, నాలుగో క్వార్టర్కు పాజిటివ్: RBI గవర్నర్
24X7 ఆర్టీజీఎస్
డిసెంబర్ 2020 నుండి రౌండ్ ది క్లాక్ (24X7) RTGS సౌలభ్యతను ఆర్బీఐ మానిటరీ పాలసీ ప్రతిపాదించింది. పేమెంట్ సిస్టం ఆపరేటర్లకు శాశ్వత ప్రాతిపదికన లైసెన్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
కరోనాతో ఆర్థిక పురోగతి ప్రతికూలంగా ఉండటంతో రిటైల్ ధరలు లక్ష్యానికంటే ఎగువన కొనసాగుతున్నాయి. 6 నెలలుగా వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) 6 శాతంకంటే అధికంగా నమోదవుతోంది. 4 శాతం స్థాయిలో సీపీఐని కట్టడి చేయాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఆగస్ట్ నెలలో కూడా సీపీఐ 6.69 శాతానికి పెరిగింది.
ఆన్లైన్ బిజినెస్ వృద్ధి, వ్యాపార అవకాశాలపై ఆశాజనకం
ప్రపంచ ఆర్థిక కార్యకలాపాలు 2020 మూడో త్రైమాసికంలో అసమానంగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయని శక్తికాంతదాస్ అన్నారు. ఇప్పటికే భారత జీడీపీ 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో భారీగా క్షీణించిందని గుర్తు చేశారు. అయితే కరోనా స్థాయి ముందుకు భారత్ పునరుద్ధరణ క్రమంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సానుకూలంగా ఉందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆహార ఉత్పత్తి వృద్ధి రికార్డ్ స్థాయిలో ఉంటుందన్నారు. ఆన్లైన్ వాణిజ్యం వృద్ధి సాధిస్తోందని, ఉద్యోగులు క్రమంగా తిరిగి కార్యాలయాలకు వస్తున్నారన్నారు. నాలుగో త్రైమాసికంలో ద్రవ్యోల్భణం లక్ష్యానికి దగ్గరగా ఉంటుందన్నారు. మున్ముందు వ్యాపార అవకాశాలు మరింత ఆశాజనకంగా ఉన్నాయని పేర్కొన్నారు.
వ్యవస్థలోకి రూ.20,000 కోట్లు
కరోనా నేపథ్యంలో నిన్నటి వరకు ఉన్న మానసిక భయం, నిరాశ నుండి ఆశ వైపు వెళ్తోందని శక్తికాంతదాస్ అన్నారు. 4వ త్రైమాసికం నాటికి ద్రవ్యోల్భణం లక్ష్యానికి చేరువగా ఉంటుందన్నారు. జీడీపీ వృద్ధి రేటు 4వ క్వార్టర్ నాటికి సానుకూలంగా ఉండవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ రంగాలు ఆర్థికంగా వేగంగా కోలుకుంటున్నాయన్నారు. వ్యవసాయం, వినియోగ వస్తువులు, పవర్, ఫార్మా రంగాలు చాలా వేగంగా రికవరీ అవుతున్నాయన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 9.5 శాతం ప్రతికూలత నమోదు చేయవచ్చునని అంచనా వేశారు. సెప్టెంబర్ నెలలో పీఎంఐ 56.9 శాతానికి పెరిగిందన్నారు. జనవరి 2012 నుండి ఇది గరిష్టం. 2020-21 మొదటి అర్ధ సంవత్సరంలో సగటు రుణ రేటు 5.82 శాతంగా ఉందని తెలిపారు. ఇది 16 ఏళ్లలో కనిష్టం అని శక్తికాంతదాస్ తెలిపారు. వేగంగా, బలంగా రీబౌండ్ సాధ్యమే అన్నారు. రుణ లభ్యతలో ఇబ్బందులు లేకుండా చూస్తున్నట్లు తెలిపారు. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్(OMO) నిర్వహిస్తామని తెలిపారు. ఆర్బీఐ వద్ద సరిపడా నగదు ఉందన్నారు. వ్యవస్థలోకి నగదు ప్రవాహం పెంచేందుకు వచ్చే వారం రూ.20,000 కోట్ల మేర ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ వేలం నిర్వహిస్తామన్నారు.