Monkeypox: అందుబాటులో ఆర్టీపీసీఆర్ కిట్
ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి నిన్న, మొన్నటిదాకా ప్రపంచాన్ని వణికించింది. ఇప్పటికీ ఈ వైరస్ పూర్తిగా నిర్మూలన కాలేదు. భారత్ సహా పలు దేశాల్లో తరచూ కొత్త కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. మరణాలు నమోదవుతూనే వస్తున్నాయి. దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,685 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 2,158 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 33 మంది మరణించారు. దేశవ్యాప్తంగా 16,308 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.60 శాతంగా నమోదైంది.
కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత తగ్గిపోయిందనుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మంకీపాక్స్ విజంభిస్తోంది. పలు దేశాల్లో దీనికి సంబంధించిన కేసులు నమోదయ్యాయి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్లోని పలు దేశాల్లో 90కి పైగా మంకీపాక్స్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ వైరస్ సోకిన తరువాత- జ్వరం, తలనొప్పి, వాపు, నడుం నొప్పి, కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. క్రమంగా చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి.
సాధారణంగా మంకీపాక్స్ కోతుల నుంచి ఎక్కువగా మనుషులకు సంక్రమిస్తుంటుంది. ఎలుకలు కూడా దీని వ్యాప్తికి కారణమౌతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. మనిషి నుంచి మనిషికి సంక్రమించే అవకాశాలు చాలా తక్కువ. అయినప్పటికీ.. దీని బారిన పడిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగితే ఇది మరొకరికి సంక్రమించే అవకాశాలు లేకపోలేదు. మంకీపాక్స్ను నివారించడానికి ప్రత్యేకంగా ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటు లేదు.
దీన్ని గుర్తిండానికి ట్రినిట్రాన్ హెల్త్కేర్ సంస్థ ప్రత్యేకంగా ఆర్టీపీసీఆర్ కిట్ను రూపొందించింది. స్మాల్పాక్స్, మంకీపాక్స్ తేడాను సైతం గుర్తించేలా దీన్ని డెవలప్ చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. చర్మంపై గాయం లేదా స్వాబ్ను సేకరించి ఈ ఆర్టీపీసీఆర్ కిట్తో మంకీపాక్స్ను ధృవీకరించుకోవచ్చని వివరించింది. పరీక్ష చేసిన గంట వ్యవధిలో ఫలితం అందుతుందని తెలిపింది. డ్రై స్వాబ్స్, వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియం స్వాబ్స్ను దీనికోసం వినియోగించవచ్చని ట్రివిట్రాన్ హెల్త్కేర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చంద్ర గంజూ చెప్పారు.