ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కరోనా వ్యాక్సిన్గా.. కోవిషీల్డ్: ఎలాగో తెలుసా?
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రస్తుతం దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు సహా రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీ స్టార్లు వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. వ్యాక్సిన్పై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను దూరం చేయడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 13,83,79,832 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు.
రూపాయికి బూస్ట్: 75 మార్క్కు టచ్: ఇదే ఊపు..మున్ముందు
కోవిషీల్డ్.. కోవాగ్జిన్..
కరోనా వ్యాక్సినేషన్ కోసం వినియోగిస్తోన్నది కోవిషీల్డ్, కోవాగ్జిన్. ఈ రెండు టీకాలను మాత్రమే వినియోగించడానికి డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ వినియోగానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. అది ఇంకా అందుబాటులోకి రాలేదు. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ను భారత్కు చెందిన టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తోంది. కోవాగ్జిన్ రూపకర్త.. హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్.
కోవిషీల్డ్ రేట్ల వివరాలివీ..
కాగా- కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసు ధరను సీరమ్ ఇన్స్టిట్యూట్ నిర్ధారించింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక్కో డోసు ధరను ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు హాస్పిటల్స్లో వేర్వేరుగా వసూలు చేసేలా ఖరారు చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర డోసు ఒక్కింటికి 400 రూపాయలను వసూలు చేస్తారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో దాని ధర 600 రూపాయలుగా నిర్ధారించారు. ఇతర దేశాల్లో అమల్లో ఉన్న రేట్ల కంటే తక్కువకే కోవిషీల్డ్ వ్యాక్సిన్ను అందిస్తున్నట్లు సీరమ్ ఇన్స్టిట్యూట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అదార్ పునావాలా వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
అత్యంత ఖరీదైనదిగా..
ప్రైవేటు ఆసుపత్రులకు నిర్ధారించిన డోసుకు 600 రూపాయల ధర ప్రస్తుతం చర్చనీయాంశమౌతోంది. ఎందుకంటే- ప్రపంచంలో దీన్ని మించిన రేటు మరొకటి లేదు. ఈ 600 రూపాయల రేటును డాలర్లతో పోల్చుకుని చూస్తే.. ఎనిమిది డాలర్లకు పైగా ఉంటుంది. అత్యంత ధనిక దేశమైన సౌదీ అరేబియాలో వ్యాక్సిన్ ధర 5.25 డాలర్లు ఉంటోంది. భారత్ తరువాత ఇదే అత్యధిక రేటు. దక్షిణాఫ్రికా-5.25, అమెరికా-4, బంగ్లాదేశ్-4, బ్రెజిల్-3.15, యునైటెడ్ కింగ్డమ్-3 డాలర్ల మేర పలుకుతోంది. యూరోపియన్ యూనియన్ దేశాల్లో కరోనా వ్యాక్సిన్ ధర 2.15 నుంచి 3.50 డాలర్లుగా ఉంటోంది.
మే 1 నుంచి నో ఏజ్ లిమిట్
వ్యాక్సిన్ వేయించుకోవడానికి 45 సంవత్సరాలు నిండి ఉండాలనే నిబంధనను కేంద్రప్రభుత్వం ఎత్తేసిన విషయం తెలిసిందే. వచ్చేనెల 1వ తేదీ నుంచి 18 సంవత్సరాలకు పైనున్న వయస్సున్న వారందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి అర్హులేనంటూ ప్రకటించింది. నేపథ్యంలో.. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఈ వ్యాక్సిన్ ధరను నిర్ధారించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో వేసే వ్యాక్సిన్ ధర ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా ఉండటం పట్ల అటు విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ వేయించుకోదలిగిచన వారు ఆ రేటును భరించగలరనే వాదన కూడా వినిపిస్తోంది.