కరోనా వైరస్ దెబ్బ: ఒక్కరోజులో రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబై: కరోనా వైరస్ భయాలు సోమవారం స్టాక్ మార్కెట్లను ముంచెత్తాయి. ఇప్పటికే చైనాలో 2వేల మంది చనిపోయారు. కరోనా ప్రభావం దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్ దేశాల్లో పెరగడంతో మార్కెట్లలో కలకలం చోటు చేసుకుంది. అమ్మకాలు పెరిగాయి. దీంతో అంతర్జాతీయ, ఆసియాతో పాటు భారత్ మార్కెట్లు భారీ నష్టాలను చవి చూశాయి.
వారంలోనే రూ.1,800... తొలిసారి రూ.43,000కు చేరిన బంగారం ధర: హైదరాబాద్లో ఎంతంటే?
ఈ ఏడాది భారీ అతి పెద్ద ఒకరోజు నష్టం
సెన్సెక్స్ ఈ ఏడాదిలోనే రెండో అతిపెద్ద ఒకరోజు నష్టాన్ని చవి చూసింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున దాదాపు వెయ్యి పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, సోమవారం 807 పాయింట్లు నష్టపోయింది. నిన్న (24 ఫిబ్రవరి) ఉదయం 41,037 పాయింట్ల వద్ద ప్రారంభమై ఓ దశలో 40,306 పాయింట్లకు దిగజారి, చివరకు 40,363 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ కూడా 251 పాయింట్లు నష్టపోయి 11,829 పాయింట్ల వద్ద స్థిరపడింది.
రూ.3.18 లక్షల కోట్ల సంపద ఆవిరి
సెన్సెక్స్ 807 పాయింట్లు, నిఫ్టీ 251 పాయింట్లు నష్టపోవడంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. సోమవారం ఒక్కరోజే రూ.3.18 లక్షల కోట్ల సంపద ఆవిరి అయింది. ప్రధాన షేర్లతో పాటు చిన్న, మధ్య స్థాయి షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ సూచీ 1.60%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.58% క్షీణించాయి. అన్ని రంగాల కంపెనీల షేర్లు కుదుపుకు గురి కావడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.3.18 లక్షల కోట్ల మేర హరించింది. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.158.51 లక్షల కోట్ల నుంచి రూ.155.33 లక్షల కోట్లకు తగ్గింది.
అన్ని షేర్లు నష్టాల్లోనే..
బీఎస్ఈలో సెన్సెక్స్ లిస్టెడ్ కంపెనీలు అన్నీ నష్టాల బాటలోనే పయనించాయి. టాటా స్టీల్ అత్యధికంగా 6.39% విలువను కోల్పోయింది. మారుతి సుజుకీ, ఓఎన్జీసీ 4% పైగా నష్టపోయాయి. HDFC, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు 3% నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే, బీఎస్ఈలోని మెటల్ సూచీ 6%, ఆటో 3.39%, టెలికాం 3.33 % తగ్గాయి. అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి.
రూపాయి బలహీనం
దేశీయ కరెన్సీ రూపాయి విలువ మూడు నెలల కనిష్టానికి పడిపోయింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ 34 పైసలు బలహీనపడి 71.98కి చేరుకుంది. ఇంట్రాడేలో ఎక్స్ఛేంజ్ రేటు 72 స్థాయిని అధిగమించింది.