ప్రభుత్వం బ్రహ్మాస్త్రం ఉపయోగించింది, కానీ 40 ఏళ్లలో తొలిసారి: ఆ ప్యాకేజీ రూ.1.5 లక్షల కోట్లే
భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి ప్రభావం భారీగానే పడిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రూ.20 లక్షల కోట్ల నుండి రూ.33 లక్షల కోట్ల వరకు నష్టం జరిగిందని అంచనాలు వెల్లడవుతున్నాయి. వైరస్-లాక్డౌన్ కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ ఎకానమీ జీడీపీలో 10 శాతం లేదా రూ.20 లక్షల కోట్ల మేరకు నష్టపోతుందని మాజీ ఫైనాన్స్ సెక్రటరీ సుభాష్ చంద్ర గార్గ్ అన్నారు.
Covid 19తో పదేళ్ల దెబ్బ: అమెరికా పరిస్థితి దారుణం.. 2030 వరకు అంతే
40 ఏళ్ల తర్వాత మొదటిసారి
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీ వాస్తవానికి రూ.1.4 లక్షల కోట్ల నుండి రూ.1.5 లక్షల కోట్ల వరకు ఉంటుందని లేదా ఇది జీడీపీలో 0.7 శాతమని తెలిపారు. 40 సంవత్సరాల తర్వాత తొలిసారి భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో భారీగా కుంచించుకుపోనుందని గార్గ్ చెప్పారు. భారత వృద్ధి దశాబ్దాల నాటికి చేరుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
బ్రహ్మాస్త్రం ఉపయోగించాం
ఇప్పటికే మందగమనం కారణంగా 2019-20 ఆర్థిక సంవత్సరం ఏమాత్రం ఆశాజనకంగా లేదని చెప్పారు. వృద్ధి రేటు 11 ఏళ్ల కనిష్టానికి చేరుకుంది. మూడు వారాల లాక్ డౌన్తో భారత్ నుండి కరోనాను తరిమికొట్టగలమని భావించామన్నారు. ప్రారంభంలో కరోనా ప్రభావం కొంతమాత్రమే ఉన్నప్పుడు ఎకనమిక్, హ్యూమన్ లాక్ డౌన్ వంటి బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించామన్నారు.
లాక్ డౌన్ నష్టాలు
కరోనా మహమ్మారి కారణంగా మార్చి 25వ తేదీ నుండి భారతదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు. సంస్థలు, ఉద్యోగులను, రైతులను, ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.21 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించింది. కానీ కరోనా వల్ల జరిగిన నష్టం రూ.20 లక్షల కోట్ల నుండి రూ.33 లక్షల కోట్ల వరకు ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.