ఎయిమ్స్కు షాక్! రెండు ఎస్బీఐ ఖాతాల నుంచి రూ.12 కోట్లు మాయం!
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో మోసాలు పెరిగిపోతున్నాయి. ఎస్బీఐ ఖాతాల్లో డబ్బులు అనూహ్యంగా మాయమైపోతున్నాయి. నకిలీ (క్లోన్) చెక్కుల ద్వారా కోట్లాది రూపాయలు మోసగాళ్ల చేతుల్లోకి పోతున్నాయి. ఈ ఆర్థిక సంత్సరం తొలి ఏడు నెలల కాలంలో ఎస్బీఐలో మోసాలు మూడింతలు పెరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రూ.3 కోట్లకు పైగా బ్యాంకు మోసం జరిగినట్లు తెలిస్తే, దానిపై బ్యాంకే సీబీఐకి ఫిర్యాదు చేస్తుంది.
తాజాగా దేశంలోని అత్యున్నత వైద్య సంస్థ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) కూడా బ్యాంకింగ్ మోసానికి గురైంది. దీని ఖాతాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని తన అన్ని శాఖలను ఎస్బీఐ అప్రమత్తం చేస్తూ.. పెద్ద మొత్తంలో ఉన్న నాన్ హోమ్ బ్రాంచ్ చెక్కుల క్లియరింగ్పై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎస్బీఐ ఫ్రాడ్ మానిటరింగ్ సెల్ తన ఉద్యోగులకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించింది.
అసలేం జరిగిందంటే... ఎయిమ్స్కు చెందిన రెండు ఎస్బీఐ ఖాతాల్లో రూ.12 కోట్ల సొమ్ము గల్లంతైనట్టు గుర్తించారు. ఎయిమ్స్ డైరెక్టర్ నిర్వహిస్తున్న ప్రధాన ఖాతా నుంచి రూ.7 కోట్లు, రీసెర్చ్ ఆఫ్ ఎయిమ్స్ డీన్స్కు చెందిన మరో ఖాతా నుంచి మరో రూ. 5 కోట్ల నగదు అక్రమంగా తరలిపోయాయి. గడిచిన రెండు నెలల్లోనే ఈ మోసం జరిగినట్టు ఎయిమ్స్ఆలస్యంగా గుర్తించింది.
అధీకృత సంతకాలులేని నకిలీ చెక్కులకు ఎస్బీఐ చెల్లింపులు చేసిందని, ఈ విషయంలో ఆ బ్యాంకు అధికారులే కారణమని ఎయిమ్స్ అంటోంది. అంతేకాదు, ప్రోటోకాల్ను అనుసరించడంలో ఎస్బీఐ విఫలమైందని, తమ ఖాతాల్లోంచి పోయిన నగదును తిరిగి జమ చేయాలని కూడా డిమాండ్ చేస్తోంది. ఈ కుంభకోణంపై దర్యాప్తు కోరుతూ ఏయిమ్స్ వర్గాలు ఇప్పటికే ఢిల్లీలోని ఆర్థిక నేరాల విభాగాన్ని సంప్రదించాయి. దీనికి సంబంధించి ఒక నివేదికను కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సమర్పించింది.
విచిత్రం ఏమిటంటే.. ఎయిమ్స్ ఖాతాలకు సంబంధించి జరిగిన మోసం వెలుగులోకి వచ్చిన తరువాత కూడా.. గత వారం డెహ్రాడూన్ (రూ .20 కోట్లకు పైగా), ముంబైలో ఎస్బీఐ నాన్-హోమ్ బ్రాంచ్ల నుంచి (రూ.9 కోట్లు) క్లోన్ చెక్కుల ద్వారా రూ.29 కోట్లకుపైగా నగదును అక్రమంగా విత్డ్రా చేసుకునే ప్రయత్నాలు జరిగాయి. ఈ విషయాన్ని పీటీఐ వెలుగులోకి తీసుకొచ్చింది.
బ్యాంకు సూచనల మేరకు ఏదైనా నాన్-హోమ్ బ్రాంచ్లో నుంచి రూ.2 లక్షలకుపైగా విలువైన చెక్ వస్తే దాన్ని క్లియర్ చేసే చేయడానికి ముందు ధృవీకరణ కోసం చెక్ జారీ చేసిన ఖాతాదారులను విధిగా సంప్రదిస్తామని ఎస్బీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పుడైతే రూ.25 వేలకు పైన లావాదేవీలను కూడా తాము జాగురూకతతో పరిశీలిస్తున్నామని చెప్పారు. మరి ఇంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఎస్బీఐ శాఖల్లో మోసాలు ఎలా జరుగుతున్నాయో పెరుమాళ్లకే ఎరుక.