రాయల్ ఎన్ఫీల్డ్ షాకింగ్ నిర్ణయం, కార్యాలయాల మూసివేత: ఉద్యోగులకు మాత్రం భారీ ఊరట
కరోనా మహమ్మారి-లాక్ డౌన్ కారణంగా ఉద్యోగులు, వ్యాపారులతో పాటు చిన్న కంపెనీల నుండి పెద్ద కంపెనీల వరకు భారీగా నష్టపోయాయి. ఉత్పత్తి -డిమాండ్ లేక గత మూడు నెలల్లో ఆయా సంస్థలు పెద్ద మొత్తంలో నష్టపోయాయి. దీంతో కొన్ని సంస్థలు ఉద్యోగులను తొలగించాయి. మరికొన్ని సంస్థలు వేతనాల్లో కోత విధించాయి. కరోనా దెబ్బతో చాలా వ్యాపారాలు దీర్ఘకాలం లేదా శాశ్వతంగా మూతబడుతాయని వివిధ సర్వేలు అంచనా వేశాయి కూడా. కరోనా దెబ్బకు స్వయంగా ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ కీలక నిర్ణయం తీసుకుంది.
COVID 19: బజాజ్ ఆటో సేల్స్, ఐనా ఉద్యోగులకు శాలరీపై గుడ్న్యూస్
ప్రాంతీయ కార్యాలయాల మూసివేత
కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావడంతో రాయల్ ఎన్ఫీల్డ్ వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దాదాపు 12 రీజినల్ ఆఫీస్లను మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అంతర్జాతీయ సర్క్యులర్ జారీ చేసింది. ఇందులో మన దేశం నుండి కూడా కొన్ని కార్యాలయాలను మూసివేస్తున్నారు. ఈ జాబితాలో గురుగ్రామ్, చెన్నై, బెంగళూరు, ముంబై, జార్ఖండ్, హైదరాబాద్, భువనేశ్వర్తో పాటు ఇతర ప్రాంతాల్లోని కార్యాలయాలను మూసివేయాలని నిర్ణయించింది.
ఉద్యోగులకు ఊరట.. వర్క్ ఫ్రమ్ హోమ్
కొన్ని రీజినల్ ఆఫీస్లను మూసివేయాలని నిర్ణయించామని, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందని కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ (CCO) లలిత్ మాలిక్ చెప్పారు. ఇలా చేస్తే ఉద్యోగుల ప్రయాణ సమయం తగ్గిపోతుందని చెప్పారు. కేవలం ఆఫీస్లు మాత్రమే మూసివేయనున్నారని, ఉద్యోగులను తొలగించే అవకాశం లేదని తెలుస్తోంది. ఇది ఉద్యోగులకు ఊరట ఇచ్చే అంశం. అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అవకాశముంది.
పెరుగుతున్న సేల్స్
కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు ఇస్తోందని, ఈ నేపథ్యంలో అమ్మకాలు క్రమంగా పుంజుకుంటాయని భావిస్తున్నట్లు రాయల్ ఎన్ఫీల్డ్ తెలిపింది. అలాగే దేశంలో సంస్థ డీలర్షిప్స్ పెంచనున్నట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో 100కు పైగా కొత్త రిటైల్ స్టోర్స్ తెరిచినట్లు చెప్పింది. మొత్తం 600కు చేరుకున్నాయి. మే నెల చివరలో, జూన్ మొదటి వారంలో కరోనా కంటే ముందు జరిగిన సేల్స్ స్థాయికి దాదాపు చేరుకున్నట్లు తెలిపింది. తమ బుకింగ్స్ ఆరోగ్యకరంగా ఉన్నాయని తెలిపింది.