వీళ్లు మామూలోళ్లు కాదుగా.. బ్యాంకుకు కన్నం వేసేందుకు సొరంగం.. అనుకున్నదొకటి అయ్యిందొకటి..
Bank Robbery: బ్యాంకులను దోచుకునేందుకు, జైళ్ల నుంచి తప్పించుకునేందుకు దొంగలు సొరంగాలు తవ్వటం లాంటి సీన్స్ మనం సాధారణంగా సినిమాల్లో చూసి ఉంటాం. కానీ నిజజీవితంలో అచ్చం ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. దీనిలో చివరికి జరిగిన ఘటన తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అసలు ఈ ట్విస్టింగ్ స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
బ్యాంక్ రాబరీ కోసం..
ఇటలీ, రోమ్ నగరంలోని ఓ ప్రముఖ బ్యాంకులో చోరీకి నలుగురు సభ్యుల ముఠా ప్లాన్ చేసింది. ఆ బ్యాంకును దోచుకోవడానికి ముఠా ఒక సొరంగాన్ని తవ్వుతున్నారు. అది కూడా బ్యాంకు ఎదురుగా మూతపడిన దుకాణం నుంచి తవ్వటం ప్రారంభించారు. రోజూ కొంత తవ్వటం చేస్తుండేవారు. అయితే ఈ పనిలో ఉండగా రోడ్డు కింద నుంచి తవ్వుతున్న సొరంగం ఒక్కసారిగా కుప్పకూలింది. దీనిపై ఇటలీ పోలీసులు విచారించగా.. చాలా ఆశ్చర్యకరమైన, షాకింగ్ సమాచారం బయటపడింది.
పండుగ రోజు దొంగిలించేందుకు..
ఇటలీలో క్రిస్మస్ మాదిరిగానే ఇటాలియన్ సెలవుదినం అయిన ఫెర్రాగోస్టో పబ్లిక్ హాలిడే రోజున దొంగతనం చేసేందుకు ఆ నలుగు ప్లాన్ చేసుకున్నారు. ఇటాలియన్ రాజధాని వీధులు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు రహస్యంగా పని ముగించాలని అనుకున్నారు. సొరంగం నుంచి బ్యాంక్ లోకి చొరబడి మళ్లీ దాని నుంచే తప్పించుకోవాలని పక్కా స్కెచ్ వేశారు.
20 అడుగుల లోతు..
ఈ రాబరీ చేసేందుకు మూసివేసిన దుకాణం నుంచి దాదాపు 20 అడుగుల లోతు లేదా ఆరు మీటర్ల కింద వరకు సొరంగం తవ్వారు. నలుగురిలో ఇద్దరు సొరంగం తవ్వుతుండగా.. మరో ఇద్దరు తవ్విన మట్టిని తొలగించారు. ఈ క్రమంలో సొరంగం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో శిథిలాల్లో చిక్కుకున్న ఇద్దరి కేకలు ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించాయి. తమను ఎలాగైనా కాపాడాలంటూ వారు వేడుకున్నారు.
శిథిలాల్లో చిక్కుకుని..
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారికి లిక్విడ్ ఫుడ్, ఊపిరి పీల్చుకోవడానికి ఆక్సిజన్ సిలిండర్ అందించారు. దాదాపు 8 గంటలు సమాచారంగా తవ్వకాలు జరిపిన అగ్నిమాపక సిబ్బంది చివరికి వారికి రక్షించారు.
దొంగల అరెస్ట్..
దోపిడీకి సహకరించిన ఇద్దరు కారులో తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు అక్కడి స్థానికులు చుట్టుముట్టడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. శిథిలాల నుంచి రక్షించిన ఒక నిందితుడిని ఎలాంటి గాయాలు లేకపోవటంతో అరెస్ట్ చేశారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు.
పోలీసుల విచారణ..
అరెస్టయిన వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు సమాచారం. తమకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నప్పటికీ పోలీసులు వారిని విచారిస్తున్నారు. బ్యాంకును దోచుకునేందుకే నిందులు సొరంగాన్ని తవ్వినట్లు పోలీసులు నిర్థారించారు. అరెస్టయిన వారికి ఈ దొంగలకు ఉన్న సంబంధాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైతేనేం నిందితులు చేసిన పని ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కర్మ అంటే ఇదేనేమో.