తెరపై కొత్త వాహన రిజిస్ట్రేషన్ సిరీస్: డీటెయిల్స్ ఇవే
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా వాహన రిజిస్ట్రేషన్ సిరీస్ను ప్రారంభించింది. కొత్తగా రోడ్డు మీదికి వచ్చే వ్యక్తిగత వాహనాలన్నీ ఇకపై ఈ సిరీస్తోనే కనిపిస్తాయి. కొత్త సిరీస్ను అమలు చేయడానికి ఉద్దేశించిన ఆదేశాలను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే- ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ అయిన తరువాత అక్కడి రిజిస్ట్రేషన్ మార్క్ను పొందాల్సిన అవసరం ఉండదు.
వన్ నేషన్.. వన్ పర్మిట్..
వన్ నేషన్-వన్ పర్మిట్..విధానంలో భాగంగా రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దేశ వ్యాప్తంగా ఒకే సిరీస్ తో వాహనాల రిజిస్ట్రేషన్లు ఉండబోతోన్నాయి. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ఇది వరకే ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా దాన్ని నోటిఫై చేసింది. ఇప్పటికే అమలులో ఉన్న ఆధార్ కార్డు, త్వరలో అందుబాటులోకి రాబోతోన్న వన్ రేషన్-వన్ నేషన్ తరహాలోనే వన్ నేషన్-వన్ పర్మిట్ను తీసుకొచ్చింది.
కొత్తగా బీహెచ్ సిరీస్..
ఆ సిరీస్ పేరు బీహెచ్.. అంటే భారత్ సిరీస్ (BH Series). దేశవ్యాప్తంగా కొత్తగా విక్రయమయ్యే వ్యక్తిగత వాహనాలు ఇకపై ఈ రిజిస్ట్రేషన్నే చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యక్తిగత వాహనదారుడు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ అయినప్పుడు- రిజిస్ట్రేషన్ ఫీజులు, రోడ్ ట్యాక్స్ లు చెల్లించాల్సిన అవసరం ఉండదనేది రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు.
బీహెచ్ రిజిస్ట్రేషన్
బీహెచ్ రిజిస్ట్రేషన్ వల్ల ఇకపై శాఖాపరమైన ఎలాంటి ఇబ్బందులు, అదనపు ఫీజులు లేకుండా వ్యక్తిగత వాహనాల్లో రాకపోకలు సాగించే అవకాశం ఉంటుందని అంటున్నారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఓ పైలట్ ప్రాజెక్టును ఇదివరకే ప్రవేశపెట్టింది. రక్షణ మంత్రిత్వ శాఖ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ఎంప్లాయిస్, నాలుగు లేదా అంతకు మించి రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో తమ కార్యాలయాలను కలిగి ఉన్న ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారికి వలంటీర్ విధానంలో తొలుత దీన్ని అమలు చేస్తుంది.
రాష్ట్రాలు మారినప్పుడు
కొనుగోలుదారులు వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో 15 సంవత్సరాలకు సంబంధించిన రోడ్ ట్యాక్స్ను ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. వేరే రాష్ట్రానికి బదిలీ అయి వెళితే.. ఆ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా మళ్లీ అక్కడ కూడా రోడ్ ట్యాక్స్ను చెల్లించాల్సి వస్తుంది. ఇది వాహనదారులకు అదనపు భారాన్ని పడేలా చేస్తోంది. ఈ ఇబ్బందులు, అదనపు భారాన్ని నివారించడానికి కొత్త విధానం తీసుకరావాలని కేంద్రం నిర్ణయించింది.
ఆన్లైన్లోనే అన్నీ..
దీన్ని అమలులోకి తీసుకొచ్చింది. బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్తో వాహనాల బదిలీ, రీరిజిస్ట్రేషన్ విధానాన్ని నోటిఫై చేసింది. రెండు సంవత్సరాలకు సంబంధించిన ఒకేసారి రోడ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే మొత్తం ప్రక్రియను పూర్తి చేసే విధంగా కార్యచరణను రూపొందించింది. అనంతరం సాధారణ కొనుగోలుదారులకు కూడా ఈ విధానాన్ని వర్తింపజేస్తుంది. దీనికోసం కొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
|
వీలైనంత త్వరలో అందరికీ..
సాధారణ వాహనదారుల కోసమే దీన్ని ప్రవేశపెట్టామని, సాధ్యమైనంత త్వరగా దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని అంటున్నారు. అదనపు ఫీజుల బాదుడు ఇకపై ఉండదనే భరోసా ఇస్తోన్నారు అధికారులు. రాష్ట్రాలు మారినప్పుడు సంభవించే శాఖాపరమైన ఇబ్బందులను తొలగించడం తమ లక్ష్యమని స్పష్టం చేస్తోన్నారు.