పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్భణం: ప్రజలకు ధరల షాక్, ఆర్బీఐ ఆందోళన!
ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్యోల్భణం అంచనా వేయడం కష్టంగా మారిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం (మే 22) పేర్కొన్నారు. దేశంలో ఆహార భద్రత ఉందన్నారు. ఏప్రిల్ నెలలో ఏకంగా 8.6 శాతానికి పెరిగినట్లు చెప్పారు. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరిగినట్లు చెప్పారు. దేశంలో ఆహార ఉత్పత్తులు 3.7 శాతం పెరిగిందని, అదే సమయంలో పారిశ్రామిక ఉత్పత్తి 17 శాతం తగ్గిందన్నారు.
వ్యవసాయ రంగం పటిష్టంగా ఉందని, లాక్ డౌన్ను బట్టి ద్రవ్యోల్భణం ఆధారపడి ఉంటుందని, ఇప్పుడే అంచనా వేయడం కష్టమన్నారు. లాక్ డౌన్ కారణంగా ఏప్రిల్ నెలలో సప్లై చైన్ దెబ్బతిన్నది. ఇది ఆహార ద్రవ్యోల్భణంపై ప్రభావం చూపింది. 2020 మార్చిలో 7.8 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్భణం ఏప్రిల్ నాటికి 8.6 శాతానికి పెరిగింది. కూరగాయలు, తృణధాన్యాలు, పాలు, పప్పుధాన్యాలు, ఎడిబుల్ ఆయిల్స్, చక్కెర ధరలు పెరిగాయి.
నెగిటివ్గా ఇండియా జీడీపీ: ఆర్బీఐ, EMI మారటోరియంపై మళ్లీ గుడ్న్యూస్
ఆయా ఉత్పత్తుల వెయిటేజీ ఇలా..
గత ఏడాది కూరగాయల ధరలు, ఉల్లి ధరలు భారీగా పెరిగడంతో ద్రవ్యోల్భణంపై ప్రభావం పడింది. 2013 డిసెంబర్ తర్వాత ఆహార ద్రవ్యోల్భణం తొలిసారి 10.1 శాతానికి చేరుకొని, రెండంకెలు అందుకుంది. ధరలు పెరిగితే కన్స్యూమర్ ప్రైస్ సూచీ పెరుగుతుంది.
సీపీఐ (కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్) వెయిటేజ్ ఇలా...
ధాన్యం ఉత్పత్తులు- 24.8%, గుడ్డు, చేపలు, మాంసం 10.3%, పాలు-పాల ఉత్పత్తులు 16.9%, నూనె పదార్థాలు 9.1%, పండ్లు 7.4%, కూరగాయలు 15.5%, పప్పు ధాన్యాలు తదితర ఉత్పత్తులు 6.1%, చక్కెర, మసాలాలు 3.5%, స్పైస్ 6.4%గా ఉన్నాయి.
రాబోయే రోజుల్లో ధరలు మరింతగా పెరగవచ్చు
రాబోయే కొద్ది రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వెయిటేజ్లో 10.3 శాతంగా ఉన్న గుడ్లు, చేపలు, మాంసం ఉత్పత్తుల ధరలు ఇప్పటికే పెరిగాయి. దీంతో పాటు లాక్ డౌన్ కారణంగా విత్తనాలు నాటే ఈ సీజన్లో ప్రభావం పడే అవకాశముంటుంది. ఇది రాబోయే కాలంలో ఆహార ఉత్పత్తి, ధరలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. అంతిమంగా వినియోగదారుడు మరింత చెల్లించవలసి రావొచ్చు.
ఆర్బీఐ ఆందోళన
ధరల స్థిరత్వాన్ని కొనసాగించేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకుంటుంది. తమకు అందుబాటులో ఉన్న అన్ని విధానాల ద్వారా ధరలను అదుపులో ఉంచే ప్రయత్నాలు చేస్తుంది. క్యాష్ రిజర్వ్స్ రేషియో, రెపో రేటు.. ఇలా అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా ధరలను నియంత్రించాలి. ప్రస్తుతం ఆర్బీఐ ద్రవ్యోల్భణ రేటు లక్ష్యాన్ని 4 శాతంగా పెట్టుకుంది. ఇండియా రిటైల్ ద్రవ్యోల్భణం లేదా సీపీఐ మార్చి నెలలో ఆర్బీఐ పెట్టుకున్న లక్ష్యానికి సమీపంలో 5.84 శాతంగా ఉంది.
ద్రవ్యోల్భణం పెరిగితే ఆర్బీఐ ఏం చేస్తుంది?
ద్రవ్యోల్భణం పెరిగితే ఆర్బీఐ తన వద్దనున్న అన్నిసాధనాల్ని ఉపయోగిస్తుంది. ద్రవ్యోల్భణం ఎక్కువగా ఉంటే రెపో రేట్లు పెంచుతుంది. రెపో రేటు అంటే ఆర్బీఐ.. బ్యాంకులకు రుణాలు ఇచ్చే వడ్డీ రేటు. రుణాలు తీసుకోవడం అంటే బ్యాంకులకు భారమే. కాబట్టే అవి వడ్డీ రేట్లను పెంచుతాయి. అప్పుడు రుణాలకు తక్కువ డిమాండ్ ఏర్పడి అంతిమంగా ద్రవ్యోల్భణాన్ని తగ్గిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్పత్తి కూడా తగ్గుతుంది. అప్పుడు వృద్ధి రేటు తగ్గే అవకాశం ఉంటుంది. ద్రవ్యోల్భణాన్ని నియంత్రించేందుకు రెపో రేట్లు తగ్గించడం లేదా పెంచితే వృద్ధిపై ప్రభావం పడుతుంది. కాబట్టి ఆర్బీఐ వృద్ధి రేటును, ద్రవ్యోల్భణం సమతుల్యతపై దృష్టి సారించాలి.