ఎగిసి'పడిన' కిషోర్ బియానీ, అందుకే రిలయన్స్ చేతికి! అమెజాన్ పరిస్థితి ఏమిటి?
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్(RRVL) తాజాగా కిషోర్ బియానీ ప్రమోట్ చేస్తోన్న ఫ్యూచర్ గ్రూప్కు చెందిన రిటైల్, హోల్సేల్ వ్యాపారాలతో పాటు లాజిస్టిక్స్, వేర్హౌజింగ్ విభాగాల్ని కొనుగోలు చేస్తోంది. ఈ మేరకు శనివారం ప్రకటించింది. ఈ డీల్ వ్యాల్యూ రూ.24,713 కోట్లు. ఫ్యూచర్ గ్రూప్కు చెందిన 1,800కు పైగా బిగ్ బజార్, ఎఫ్బీబీ ఈజీడే, సెంట్రల్, ఫుడ్ హాల్ స్టోర్స్ రిలయన్స్ రిటైల్ చేతికి రానున్నాయి. అమెజాన్ వంటి ఈ-కామర్స్ కంపెనీలకు ధీటుగా ఈ రంగంలో పట్టు సాధించే దిశగా రిలయన్స్ అడుగులు వేస్తోంది.
రిలయన్స్ చేతికి 'ఫ్యూచర్' బిగ్బజార్, డీల్ వ్యాల్యూ రూ.24,713 కోట్లు
ఫ్యూచర్ గ్రూప్ రుణభారం
రుణభారానికి తోడు కరోనా-లాక్డౌన్తో ఫ్యూచర్ గ్రూప్ ప్రధాన కంపెనీ ఫ్యూచర్ రిటైల్ ఆర్థిక సంక్షంభోలోకి వెళ్లింది. గ్రూప్లోని మిగతా కంపెనీల పరిస్థితి దాదాపు ఇదే విధంగా ఉంది. ఈ గ్రూప్లోని ఆరు లిస్టెడ్ కంపెనీలపై ఉన్న మొత్తం రుణభారం 2019 సెప్టెంబర్ 30వ తేదీ నాటికి రూ.12,778 కోట్లకు పెరిగింది. 31 మార్చి 2019 నాటికి ఇది ఈ రుణబారం రూ.10,951 కోట్లుగా ఉంది. ఫ్యూచర్ గ్రూప్ అధినేత కిషోర్ బియానీ కుటుంబం హోల్డింగ్ కంపెనీలపై దాదాపు అంతే రుణభారం ఉంది. పైగా హోల్డింగ్ కంపెనీల చేతుల్లోని మెజార్టీ షేర్లు తాకట్టులో ఉన్నాయి.
కిషోర్ బియానీ ఇలా ఎదిగారు..
భారత ఆర్థిక సరళీకరణలకు కొన్నేళ్ల ముందు కిషోర్ బియానీ మెన్స్ అప్పారెల్ వ్యాపారం ప్రారంభించారు. 1987లో మాంజ్ వేర్ ప్రయివేట్ను విలీనం చేసుకున్నారు. 1997లో మొదటి పెద్ద ఫార్మాట్ పాంటాలూన్స్ అవుట్లెట్ను ప్రారంభించారు. బేర్, జాన్ మిల్లర్, అప్పారెల్ బ్రాండ్స్ను లాంచ్ చేశారు. దుస్తుల ద్వారా పెద్ద వ్యాపారంలోకి తొలి అడుగు పెట్టారు. 2001లో కిషోర్ బియానీ మొదటి బిగ్ బజార్ను ప్రారంభించారు. పెద్ద ఫార్మాట్ సూపర్ మార్కెట్లు, ఎలక్ట్రానిక్ షాప్స్, ఫర్నీచర్ విక్రయించే రిటైల్ షాప్స్, అప్పారెల్ బ్రాండ్, మల్టీ బ్రాండ్ రిటైల్ చైన్స్ తెరిచారు. 2006లో ఫ్యూచర్ గ్రూప్.. ఇటాలియన్ ఇన్సురెన్స్ మేజర్ జనెరల్తో జాయింట్ వెంచర్ను ప్రారంభించింది.
కొనుగోళ్లు
ఆ తర్వాత క్రమంగా రుణాలు పెరిగాయి. 2012లో తన ప్రధాన బ్రాండ్ పాంటాలూన్స్ రిటైల్ ఫార్మాట్ను ఆదిత్య బిర్లా గ్రూప్కు రూ.1600క విక్రయించారు. ఆ సమయంలో ఫ్యూచర్ గ్రూప్ రూ.7,850 కోట్ల ఏకీకృత రుణాలు కలిగి ఉంది. ఆ తర్వాత కిషోర్ బియానీ అత్యంత విశ్వసనీయులు గ్రూప్ను విడిచి పెట్టారు. అయితే 2014-2017 మధ్య ఫ్యూచర్ గ్రూప్ పలు జాతీయ, ప్రాంతీయ రిటైల్ ఫార్మాట్లను కొనుగోలు చేసింది. ఇందులో ముఖ్యంగా గ్రోసరీస్ ఉన్నాయి. 2014లో సౌత్ ఇండియాకు చెందిన నీల్గిరీస్ గ్రాసరీ స్టోర్స్ చైన్ను రూ.300కు కొనుగోలు చేసింది. ఫుడ్హాల్ను ప్రారంభించారు. 2016లో ఈజీడేను కొనుగోలు చేసింది.
ఇలా దెబ్బపడింది
అయితే గత కొంతకాలంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ దిగ్గజాల ప్రభావం పడింది. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో గత ఏడాది 100 ఈజీడే స్టోర్స్ను క్లోజ్ చేసింది. 2016లో 124 స్టోర్స్ బెంగళూరు ఆధారిత హెరిటేజ్ ఫ్రెష్ను సొంతం చేసుకుంది. 2017లో రూ.650 కోట్లతో హైపర్ సిటీ రిటైల్ను వశం చేసుకుంది. 2017లో ఈజోన్... బిగ్ బజార్తో కలిసింది. 2014లో జెఫ్ బెజోస్ ఇండియాలో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతానని ప్రకటించారు. 2018లో వాల్మార్ట్ 16 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఫ్లిప్కార్ట్లో మెజార్టీ వాటాను కొనుగోలు చేసింది. దీంతో రిటైల్ బిజినెస్లో మార్పులు వచ్చాయి. ఆన్ లైన్ అమ్మకాలు వేగంగా పెరిగాయి. ఈ కామర్స్ దెబ్బతినడం, దుస్తులు, పాదరక్షల బిజినెస్లోకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ రావడం దెబ్బతీసింది.
అమెజాన్ పరిస్థితి ఏమిటి?
రిలయన్స్తో డీల్ కుదిరిన నేపథ్యంలో ఫ్యూచర్ గ్రూప్లో పెట్టుబడులు ఉన్న అమెజాన్ పరిస్థితి ఏమిటనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. గత ఏడాది ఆగస్ట్ నెలలో ఫ్యూచర్ కూపన్స్లో అమెజాన్ 49 శాతం వాటాను కొనుగోలు చేసింది. తద్వారా ఫ్యూచర్ రిటైల్లో 1.3 శాతం వాటా పొందింది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్తో ఒప్పందం తర్వాత కంపెనీ మైనార్టీ వాటాదారుల నుండి 26 శాతం వాటా కొనుగోలు కోసం రిలయన్స్ రిటైల్ ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి ఉంటుంది.