RIL Q1 results: రిలయన్స్ లాభం రూ.12,273 కోట్లు, జియో, రిటైల్ అదుర్స్
ముంబై: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏప్రిల్-జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. కరోనా సమయంలోను సంతృప్తికర ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.12,273 కోట్లుగా నమోదయింది. FY21 ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.13,233 కోట్లతో పోలిస్తే 7.2 శాతం తక్కువ. కరోనా సమయంలో అధిక వ్యయాలు ఇందుకు కారణం. మార్చి త్రైమాసికంలో లాభం రూ.10,845 కోట్లతో పోలిస్తే పదమూడు శాతం ఎక్కువ.
కంపెనీ వ్యయాలు పెరిగాయ్
కంపెనీ వ్యయాలు ఏడాదిలో రూ.91,238 కోట్ల నుండి రూ.1,44,372 కోట్లకు పెరిగాయి. సేల్స్, సర్వీసెస్ వ్యాల్యూ 57.4 శాతం అధికంగా రూ.1,58,862 కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో వ్యయాలు 50 శాతం పెరిగి కంపెనీ లాభాలను తటస్థీకరించింది. పన్ను వ్యయాలు రూ.3464 కోట్లకు, మొత్తం వ్యయాలు రూ.1.31 లక్షల కోట్లకు చేరుకున్నాయి. కంపెనీ చమురు రసాయనాల వ్యాపార ఆదాయాలు రూ.58,906 కోట్ల నుండి 75.2 శాతం వృద్ధితో రూ.1.03 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ముడి చమురు ధరకు అనుగుణంగా ఉత్పత్తి ధరలు పెరిగాయి.
జియో అదుర్స్
జియో ప్లాట్ఫామ్స్ నికర లాభం ఏకంగా 45 శాతం పెరిగి రూ.3651 కోట్లకు చేరుకుంది. ఒక్కో కస్టమర్ పైన వచ్చే ఆర్పు రూ.138.4గా నమోదయింది. ఎక్కువ మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండటం, విద్యార్థులకు ఆన్లైన్ క్లాస్లు ఉండటం వల్ల డేటా, వాయిస్ ట్రాఫిక్ పెరిగింది. త్రైమాసికంలో మొత్తం డేటా ట్రాఫిక్203GBగా ఉంది. జూన్ 30 నాటికి కస్టమర్ల సంఖ్య 44.06 కోట్లకు చేరుకుంది. త్రైమాసికంలో చేరిన కొత్త కస్టమర్ల సంఖ్య 4.23 కోట్లుగా ఉంది. సేవలపై ఆదాయం 9.8 శాతం పెరిగి రూ.22,267 కోట్లకు చేరుకుంది. త్రైమాసికం ఎబిటా రూ.8892 కోట్లు.
రిటైల్ లాభాలు పెరిగాయి
కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, రిటైల్ విభాగంలో రెట్టింపు లాభాలు వచ్చాయి. నికర లాభం 123.2 శాతం పెరిగి రూ.962 కోట్లకు చేరుకుంది. ఆదాయం 19.04 శాతం పెరిగి రూ.28,197 కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో 123 సేల్ పాయింట్స్ జత కలిశాయి. మొత్తం స్టోర్స్ సంఖ్య 12,803కు చేరింది. మరో 700 స్టోర్స్ను తెరిచే అవకాశముంది.