రిలయన్స్ కొత్త ఎనర్జీ బిజినెస్, ఐదేళ్లలో రిలయన్స్ రిటైల్ మూడు రెట్లు
2016లో వచ్చిన జియో భారత్లో టెలికం విప్లవాన్ని తీసుకు వచ్చిందని ముఖేష్ అంబానీ చెప్పారు. ఇప్పుడు 2021లో రిలయన్స్ సరికొత్త గ్రీన్ ఎనర్జీ బిజినెస్ను ప్రారంభిస్తుందన్నారు. ఇందుకు తాము రిలయన్స్ న్యూ ఎనర్జీ కౌన్సిల్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు 100GW సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేసే దిశగా ప్రణాళికలు రచిస్తోందన్నారు. రిలయన్స్ క్లీన్ ఎనర్జీ వ్యాపారానికి జామ్నగర్ మూలకేంద్రంగా ఉండనుంది.
జామ్ నగర్లో ధీరుబాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ను 5వేల ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు ముఖేష్ అంబానీ. ఇందుకోసం నాలుగు గిగా ఫ్యాక్టరీలను ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఒకటి సోలార్ ఎనర్జీ ఉత్పత్తి కోసం ఇంటిగ్రీటెడ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్ ఫ్యాక్టరీ, రెండు స్టోరేజ్ ఇంటర్మిటెంట్ ఎనర్జీ (అడ్వాన్స్డ్ ఎవరీ స్టోరేజ్ బ్యాటరీ ఫ్యాక్టరీ, మూడు ఎలక్ట్రోలైజర్ ఫ్యాక్టరీ- ప్రొడక్షన్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్, నాలుగు ఫుల్ సెల్ ఫ్యాక్టరీ - హైడ్రోజన్ను మొబైల్, స్టేషనరీ పవర్కు కన్వర్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
రిలయన్స్ వ్యాల్యూచైన్ పార్ట్నర్షిప్ అండ్ ఫ్యూచర్ టెక్నాలజీ కోసం రూ.15000 పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. రిలయన్స్ రిటైల్ రానున్న మూడు నుండి అయిదేళ్ల కాలంలో 3 రెట్లు పెరిగే అవకాశముందన్నారు.
నీతా అంబానీ మాట్లాడుతూ... కరోనా అతిపెద్ద సంక్షోభమని, మానవత్వానికి పరీక్ష పెట్టిందని, అంత చీకటి సమయంలో కూడా మా లక్ష్యాలు చేరుకున్నామని, తాము అందరం సమష్టిగా పోరాడామన్నారు. కరోనా వ్యాప్తి ప్రారంభం కాగానే తమ 14 పాఠశాలలు డిజిటల్ మోడ్లోకి మారాయని, జియో ఇనిస్టిట్యూట్ ఈ ఏడాది నుండి నేవీ ముంబైలోని క్యాంపస్లో తరగతులు ప్రారంభించనుందన్నారు. కరోనాపై పోరుకు రిలయన్స్ మొత్తం ఐదు కార్యక్రమాలను చేపట్టిందని, మిషన్ ఆక్సిజన్, మిషన్ కొవిడ్ ఇన్ఫ్రా, మిషన్ అన్నసేవ, మిషన్ ఎంప్లాయికేర్, మిషన్ వ్యాక్సిన్ సురక్ష కార్యక్రమాలు ప్రారంభించామన్నారు.
జామ్ నగర్ రిఫైనరీని కొన్ని రోజుల్లోనే అత్యుత్తమ శ్రేణి మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రంగా మార్చామని, తమ ఇంజినీర్లు 85 వేల పని గంటలు వెచ్చించి దీనిని సాధించారన్నారు. ప్రస్తుతం రిలయన్స్ దేశ అవసరాల్లో 11 శాతం మెడికల్ ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తోందని, దీనిని పూర్తి ఉచితంగా అందిస్తున్నామన్నారు. రిలయన్స్ దేశ విదేశాల నుంచి 100 మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ ట్యాంకర్లను కొనుగోలు చేసిందని, వివిధ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అమర్చినట్లు తెలిపారు.