కొత్త వ్యాపారంలోకి ముకేశ్ అంబానీ... వాడేసిన ప్లాస్టిక్ తో రోడ్లు!
కాదేదీ కవితకు అనర్హం అని అన్నాడో కవి. మన దేశంలో అపర కుబేరుడు ఐన ముకేశ్ అంబానీ కూడా ఇందుగలడందు లేడని సందేహం వలదు అన్నట్లు అన్ని రకాల వ్యాపారాల్లోకి ప్రవేశిస్తున్నారు. తాజాగా ఆయనకు మరో ఆలోచన తట్టింది. వాడేసిన ప్లాస్టిక్ తో రోడ్లు వేస్తే ఎలా ఉంటుంది అని. అనుకున్నదే ఆలస్యం... మహారాష్ట్ర లోని ఒక ప్రాంతంలో టెస్టింగ్ కోసం ఒక రోడ్ ను వేసేశారు. ఇప్పుడు దాన్ని పూర్తిస్థాయి వ్యాపారంగా మార్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రస్తుతం ఇండియాలో రోడ్లు వేసేందుకు ఎక్కువగా బిటుమిన్ వాడుతున్నారు. వీటినే మనం బ్లాక్ టాప్ (బీటీ) రోడ్లు అంటాం. అయితే, ఇకముందు ఈ రోడ్లు వేసే సమయంలో బిటుమిన్ లో కొంత ప్లాస్టిక్ ను కూడా వాడాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ సూచిస్తోంది. పేరుకుపోతున్న ప్లాస్టిక్ భూతానికి చెక్ పెట్టవచ్చని, రోడ్లను వాడి పడేసిన ప్లాస్టిక్ ను రీసైకిల్ చేసి, రోడ్లకు వాడితే పర్యావరణానికి మేలు జరుగుతుందని రిలయన్స్ భావిస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ ఏ ఐ ) కు ఒక ప్రతిపాదన చేసింది. ఈ విషయాన్నీ ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. అది అమల్లోకి వస్తే త్వరలోనే భారత్ లో కొత్తగా వేసిన తారు రోడ్లు, ప్లాస్టిక్ మిళితమై ఉంటాయి. ఎక్కువ కాలం మన్నుతాయి.
ప్రత్యేక బ్రాండు...
రోడ్లు వేసేందుకు వాడే బిటుమిన్ లో కలిపే ప్లాస్టిక్ పదార్థాన్ని ప్రత్యేక బ్రాండ్ పేరుతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు రిలయన్స్ పెట్రోకెమికల్ విభాగం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ విపుల్ షా వెల్లడించారు. ఇదొక గేమ్ ఛేంజింగ్ ప్రాజెక్టు అవుతుందని పేర్కొన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే ప్లాస్టిక్ ను వినియోగించి పర్యావరణహిత గొడుగులు తయారు చేసింది. ఆర్ ఇలన్ అనే బ్రాండు పేరుతో వాటిని విక్రయిస్తోంది. సరిగ్గా అలాగే రోడ్ల కోసం ప్రత్యేక బ్రాండ్ ప్లాస్టిక్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సుమారు 50 టన్నుల వాడి పడేసిన ప్లాస్టిక్ మెటీరియల్ ను శుద్ధ చేసి 40 కిలోమీటర్ల రోడ్డును వేసి పరీక్షించింది. ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ సంవత్సరానికి 200 కోట్ల పెట్ బాటిల్స్ ను రీసైకిల్ చేస్తోంది. మరో ఏడాదిన్నరలో దీనిని రెట్టింపు చేయాలనీ లక్ష్యంగా పెట్టుకుంది.
రోజుకు 25,940 టన్నుల ప్లాస్టిక్...
దేశంలో రోజుకు సరాసరి 25,940 టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ తయారవుతోంది. దీన్ని సరిగ్గా సేకరించి, రీసైకిల్ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తల ప్రాణం తోకకు వస్తోంది. ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చినా ... ప్లాస్టిక్ భూతాన్ని పూర్తి స్థాయిలో తరిమేయలేకపోతున్నారు. అయితే, అదే ప్లాస్టిక్ ను శుద్ధి చేసి, ఇలా రోడ్ల కోసం వాడితే అటు రోడ్లు బాగుపడతాయి, ఇటు ప్లాస్టిక్ కుప్పలు తగ్గుముఖం పడతాయి. రోడ్ల ఏర్పాటుకు ప్లాస్టిక్ ను వినియోగించాలని కొన్నేళ్లుగా ప్రతిపాదనలు ఉన్నా... మార్కెట్లో ఇలా శుద్ధి చేసిన ప్లాస్టిక్ అనుకున్న స్థాయిలో అందుబాటులో లేకపోవటంతో ప్రభుత్వం ముందుకు పోలేదు. అక్కడక్కడా ప్రయోగాత్మకంగా ప్లాస్టిక్ రోడ్లను వేసి పరిశీలించారు. కానీ ఇకముందు ఎన్ హెచ్ ఏ ఐ తన టెండర్ డాక్యూమెంట్ల లోనే ఎంత స్థాయిలో ప్లాస్టిక్ వాడాలో ప్రత్యేకంగా పేర్కొంటే మార్పు కనిపిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
కిలో మీటర్ కు రూ 1 లక్ష తక్కువ ఖర్చు...
ఇలా శుద్ధి చేసిన ప్లాస్టిక్ ను రోడ్ల నిర్మాణానికి వాడితే నాణ్యత పెరగటంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుంది. అలాగే ఈ రోడ్లు వాటర్ ప్రూఫ్ గా ఉంటాయి. కాబట్టి ఎక్కువ కాలం మన్నుతాయి. సాధారణంగా బిటుమిన్ లో 8-10% మేరకు ప్లాస్టిక్ ను వినియోగించవచ్చు. ఇలా చేస్తే 3.5 మీటర్ల వెడల్పు (సింగల్ లేన్) గల రోడ్లు ప్రతి కిలో మీటర్ నిర్మాణానికి రూ 1 లక్ష వరకు తక్కువ ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. అంటే, అటు పర్యావరణహితం, ఇటు తక్కువ వ్యయం. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నమాట. రోజువారీగా మనం వినియోగించే పాలిథిన్ బ్యాగులు, పాకేజింగ్ బ్యాగులు, చాకోలెట్ రేపేర్లు, మల్టీ లేయర్ ఫిలిమ్స్, వెఫెర్స్, ఈకామెర్స్ పాకేజింగ్ మెటీరియల్ సహా అనేక రకాల వాడి పడేసిన ప్లాస్టిక్ ను శుద్ధి చేసి, రోడ్లలో వాడే ప్లాస్టిక్ ముడి పదార్థంగా తయారు చేస్తారు. బాగుంది కదా ఐడియా?